ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగ సందడి మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భక్తీ శ్రద్ధలతో జరిపే బోనాల పండుగలో తొలి బోనం గోల్కొండ జగదాంబికకు భక్తులు సమర్పిస్తుంటారు. అందులో భాగంగా గురువారం (జులై 16) మధ్యాహ్నం నుంచే బోనాల సంబరాలు మొదలయ్యాయి. పోతరాజుల సయ్యాటలు, శివసత్తుల ఆటల మధ్య ఘటాల ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ జగదాంబిక ఆలయం వరకు జరిగే ఊరేగింపు కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
బోనాలలో కీలకమైన ఘటాల ఊరేగింపు.. తొట్టెల ఊరేగింపు కోసం భారీగా ఏర్పట్లు చేశారు. పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లంగర్ హౌజ్ నుంచి ఘటాల ఊరేగింపు కొనసాగుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలో పాల్గొనేందుకు సిటీ నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. దాదాపు మూడు కిలోమేటర్ల మేర ఊరేగింపు ఉంటుంది.
ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఊరేగింపు సందర్భంగా పోతరాజుల ఆటలు, శివసత్తుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతరాజులతో కలిసి మంత్రులు చేసిన నృత్యం భక్తులను ఆకట్టుకుంది.
ప్రతీ ఏటా ఘటాల ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి తీసుకెళ్తుంటారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు సాగే ఊరేగింపు భక్తులకు చాలా ప్రత్యేకం. సాయంత్రం 6, 7 గంటల వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి ఉత్సవాల విగ్రహాలు కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ సందర్భంగా.. ఏడు వారాల పాటు అమ్మవార్లకు బోణం సమర్పిస్తుంటారు భక్తులు.
ALSO READ : ఆధ్యాత్మికం: కురుక్షేత్ర యుద్ద సమయంలో బలరాముడు ఎక్కడ ఉన్నాడు..అత్యంత బలం కలిగిన వీరుడు ఎందుకు పాల్గొనలేదు..!
హైదరాబాద్ సిటీ తొలిబోనం ఎత్తనున్న సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. లోకల్ పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు.
