శంషాబాద్, వెలుగు: నేపాల్లో జరిగిన 55వ ఏషియన్ బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ 75 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అల్వాల్కి చెందిన రాహుల్ సిందాకు శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాహుల్ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, స్నేహితులు తరలివచ్చారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ ఏషియన్ బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించడం గర్వంగా ఉందని వ్యక్తంచేశారు. 11 ఏళ్లుగా ఓల్డ్ అల్వాల్లోని పవర్ హౌస్ జిమ్ బాడీ బిల్డింగ్ స్పోర్ట్స్ కోచ్ శ్రీనివాస్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలిపారు.
రాహుల్ సిందా తెలంగాణ నుంచి పదిసార్లు పోటీల్లో పాల్గొన్నారు. అతను సాధించిన మెరిట్లలో మిస్టర్ తెలంగాణ 10 సార్లు,2015 –-16లో జూనియర్ మిస్టర్ ఇండియా, పలుసార్లు ఫెడరేషన్ కప్ చాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు. 2016 లో మిస్టర్ వరల్డ్ బ్రోంజ్ మెడల్,2018లో ఏషియా సిల్వర్ మెడల్ సాధించాడు. క్రీడల్లో అతని ప్రతిభను చూసిన రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు 2019లో స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చింది. మొదటి నుంచి ప్రపంచ స్టాండర్డ్ చాంపియన్గా ఎదిగేందుకు గైడ్ చేసిన కోచ్ శ్రీనివాస్కు రాహుల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.