- కాంగ్రెస్ ఇప్పుడు రాకుంటే.. ఇంకెప్పుడూ రాదు
- మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు
న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ఇకముందు ఆ పార్టీ కనుచూపు మేరలో కనపడదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. బలహీన వర్గాలకు సీఎం పదవి కేటాయించాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్కు గురువారం లేఖ రాశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గోనె ప్రకాశ్ రావు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కేటాయించిన కాంగ్రెస్ సీట్లపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్లో ప్యారాచూట్లకు స్థానం కల్పించారని విమర్శించారు. సీట్లు అమ్ముకున్నారని తాను అనడం లేదని, సీట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొందని అన్నారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్ఎస్లో గెలవలేకపోయారని, వారు కాంగ్రెస్ నుంచి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. బోథ్ లో కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాదన్నారు.