
- రాడిసన్-డీఎల్ఎఫ్ రూట్లో కొత్త ఫ్లై ఓవర్ !
- మూడు లేన్లతో కిలోమీటర్ మేర నిర్మాణానికి బల్దియా ప్లాన్
- హెచ్సిటీ పనుల్లో భాగంగా రూ.150 కోట్లతో కన్స్ట్రక్షన్
- స్టడీ కోసం చెన్నైకి చెందిన సంస్థకు బాధ్యతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ ఫర్ మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) లో భాగంగా గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ మీదుగా కిలోమీటర్ మేర ఫ్లైఓవర్ నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఈ ఫ్లైఓవర్ను మూడు లేన్లలో నిర్మించాలని భావిస్తుండగా ఒక చోట అండర్ పాస్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనికి దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చవుతుందనే అంచనాతో ఉన్నారు.
అయితే, ఫ్లైఓవర్ తొందరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో బల్దియా అధికారులు స్టడీ చేసేందుకు చెన్నైకి చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. మరో15 రోజుల్లో వీరు రిపోర్ట్సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా టెండర్లు పిలవనున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే హైటెక్ సిటీ, కొండాపూర్, కొత్తగూడ మీదుగా వచ్చే వాహనాలు నానక్ రాంగూడ, లింగంపల్లి వైపు ఈజీగా వెళ్లొచ్చు. ప్రధానంగా డీఎల్ ఎఫ్ వైపు వెళ్లవారికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది.
రూ. 7032 కోట్లతో హెచ్ సిటీ పనులు
రాష్ట్ర ప్రభుత్వం హెచ్ సిటీపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రూ. 7032 కోట్ల వ్యయంతో 58 పనులు చేపట్టనున్నారు. ఇందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్ లు, రైల్ ఓవర్ బ్రిడ్జిలు 4, రైల్వే అండర్ బ్రిడ్జిలు 3, 10 రోడ్డు వెడల్పు పనులను చేపట్టేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో కొన్ని టెండర్ల దశలో ఉండగా, ఇంకొన్ని టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ స్టేజీలో ఉన్నాయి. ఇందులో కొన్ని పనులు మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి. త్వరలో రాడిసన్- బ్లూ హోటల్ నుంచి డీఎల్ఎఫ్ వరకు నిర్మించనున్న ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా ఇందులో భాగమే..ఈ పనులు కూడా వచ్చేనెలలోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.