
- మల్టీ జోన్- 1లో 379, మల్టీ జోన్-2లో 228 పోస్టులు
- వచ్చే నెల 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. 17 వరకు చివరి తేదీ
- జులై 18–19 తేదీల్లో అప్లికేషన్ ఎడిట్కు అవకాశం
- మెడికల్ కాలేజీల్లో తప్పనున్న టీచింగ్ తిప్పలు
హైదరాబాద్, వెలుగు: వైద్య ఆరోగ్య శాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జులై 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని బోర్డు అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 10 నుంచి http://mhsrb.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 17 సాయంత్రం 5 గంటల వరకు, వివరాల ఎడిట్కు జులై 18-–19 తేదీల్లో అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతి పోస్టుకు విడిగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మల్టీ జోన్–-1లో 379, మల్టీ జోన్-–2లో 228 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు వేతనం ఉంటుంది.
బోధన సమస్యలకు చెక్
మెడికల్ కాలేజీల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భర్తీతో మెడికల్ కాలేజీల్లో బోధన సమస్యలు దాదాపు తీరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, గత 17 నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం 2,322 నర్సింగ్ ఆఫీసర్, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1,931 మల్టీ పర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలో మెరిట్ జాబితాలు విడుదలవుతాయని ఆయన పేర్కొన్నారు.