యూట్యూబర్లకు గుడ్ న్యూస్: 500 మంది సబ్ స్క్రైబర్స్ ఉంటే చాలు.. డబ్బులొస్తాయి

యూట్యూబర్లకు గుడ్ న్యూస్: 500 మంది సబ్ స్క్రైబర్స్ ఉంటే చాలు.. డబ్బులొస్తాయి

కంటెంట్ క్రియేటర్లకు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ శుభవార్త చెప్పింది. మానిటైజేషన్ నిబంధనలను సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం.. కంటెంట్ క్రియేటర్లు 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే చాలు యూట్యూబ్ మానిటైజేషన్‌కు అప్లై చేసుకోవచ్చు. గతంలో మానిటైజేషన్ కు అప్లై చేసుకోవాలంటే 1000 మంది సబ్ స్క్రైబర్స్ అవసరం ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను సగానికి తగ్గించిందన్నమాట. ఈ నిర్ణయంతో తక్కువ సబ్‌స్క్రైబర్ల ఉన్న వారు కూడా యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు.

4వేల గంటలు కాదు.. 3 వేల గంటలే

వ్యూస్‌ విషయంలో కూడా యూట్యూబ్ నిబంధనలు సడలించింది. మానిటైజేషన్ పొందడానికి గతంలో కనీసం 4 వేల గంటల పాటు యూట్యూబ్ ప్లాట్ ఫామ్‌లో ఉన్న కంటెంట్‌ను వీక్షకులు చూసి ఉండాలి. ఇప్పుడు ఆ సంఖ్యను 3వేల గంటలకు తగ్గించింది. ఇప్పుడు క్రియేటర్లు 3 వేల వాచ్ అవర్స్ లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్‌ షార్ట్స్‌ వ్యూస్‌ కాని పొంది ఉండాలి. గతంలో ఇది 10 మిలియన్లుగా ఉండేది. ఈ నిబంధనలు రెవెన్యూ షేరింగ్‌లో కూడా కొనసాగిస్తామని యూట్యూబ్ తెలిపింది.

మన దేశంలో ఇప్పుడే కాదు

తొలుత ఈ నిబంధనలు అమెరికా, బ్రిటన్‌, కెనడా, తైవాన్‌, దక్షిణ కొరియాలో అమలు కానున్నాయి. త్వరలోనే మిగిలిన దేశాలకు విస్తరిస్తామని యూట్యూబ్ తెలిపింది. భారత్‌లో ఎప్పుడు అములవుతుంది అన్న దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా యూట్యూబ్‌ తీసుకొచ్చిన ఈ నిబంధనల వల్ల చిన్న క్రియేటర్లు డబ్బులు సంపాదించుకోవడానికి వీలు కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీకు తెలిసిన వారిలో ఈ అర్హతలు ఉన్న వాళ్లు విదేశాల్లో ఉంటే వెంటనే యూట్యూబ్‌ మానిటైజేషన్‌ ప్రోగ్రామ్‌కు అప్లై చేసేయమనండి.