
మందమర్రి-బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య (ఓవర్హెడ్ ఎలక్ర్టిక్ వైర్)ఓహెచ్ఈ తెగిపోవడంతో మూడు గంటల పాటు పలు ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లను రైల్వే ఆఫీసర్లు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోరఖ్పూర్ నుంచి మహబూబ్నగర్కు వెళ్లే సమ్మర్ స్పెషల్ ట్రైన్ బెల్లంపల్లి నుంచి బయలుదేరి వెళ్లగా మందమర్రి రైల్వే స్టేషన్కు రెండు కిలోమీటర్ల సమీపంలో రైల్ఇంజిన్ పై భాగంలోని ఓహెచ్ఈ వైర్ ఇరుక్కుపోయి తెగిపోయింది. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. గోరఖ్పూర్-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోవడంతో దాని వెనకాలే వచ్చే రాజధాని, కోర్బా, కాగజ్నగర్- సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్, సింగరేణి, జీటీ, దానాపూర్ తదితర ఎక్స్ప్రెస్ రైళ్లను బెల్లంపల్లి రైల్వే స్టేషన్, రెబ్బెన, అసిఫాబాద్ రైల్వే స్టేషన్లలో నిలిపివేశారు. మూడు గంటల తర్వాత రైల్వే ఆఫీసర్లు ఓఎస్డీ వైర్ను పునరుద్ధరించడంతో ఆలస్యంగా రైళ్ల రాకపోకలు కొనసాగాయని బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఇంచార్జి మేనేజర్ పప్పు కుమార్, డిప్యూటీ స్టేషన్ మాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు