బాన్సువాడ, వెలుగు : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మోస్రా మండల కేంద్రానికి గాజుల చంద్రకళ, సాయిలు కుమార్తె సౌమ్య కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిందన్నారు. గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సౌమ్య కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆర్మూర్ లో ఘన నివాళి
ఆర్మూర్ : ఆర్మూర్ టౌన్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సౌమ్య ఫొటోకు పట్టణ పద్మశాలీ సంఘం, ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక మోహన్ దాస్, కొక్కెర భూమన్న, అంగరి ప్రదీప్, మూగ ప్రభాకర్, పులి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
