- ఇంట్రాడే నష్టాల నుంచి కోలుకున్న కంపెనీ షేరు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ కన్వెనియెన్స్ ఫీజు కింద సంపాదించే రెవెన్యూలో 50 శాతం వాటాను ప్రభుత్వానికి ఇవ్వాలనే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్స్పై వచ్చే కన్వెనియెన్స్ ఫీజులో 50 శాతాన్ని షేర్ చేయాలని ప్రభుత్వం అడిగిందని గురువారం ఐఆర్సీటీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. కన్వెనియెన్స్ ఫీజు కింద కంపెనీకి పెద్ద మొత్తంలో రెవెన్యూ వస్తోంది. ఆన్లైన్ బుకింగ్స్ కోసం సర్వీస్ అందిస్తున్నందుకు కంపెనీ ఈ ఫీజును వసూలు చేస్తుంది. ‘ఐఆర్సీటీసీ కన్వెనియెన్స్ ఫీజుపై తీసుకున్న నిర్ణయాన్ని రైల్వేస్ మినిస్ట్రీ వెనక్కి తీసుకుంది’ అని తాజాగా డీఐపీఏఎం సెక్రెటరీ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. ఐఆర్సీటీసీ షేర్లు శుక్రవారం సెషన్లో 25 శాతానికి పైగా పతనమై ఇంట్రాడేలో రూ.639 స్థాయిని టచ్ చేశాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోఈ కంపెనీ షేర్లు నష్టాల నుంచి రికవర్ అవ్వగలిగాయి. చివరికి ఐఆర్సీటీసీ షేరు 7.74 శాతం తగ్గి రూ.842.80 వద్ద ముగిసింది. కంపెనీ షేర్లు తాజాగా స్ప్లిట్ అయిన విషయం తెలిసిందే. కంపెనీ షేర్లు 2019 లో రూ. 644 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.