మెదక్, వెలుగు: ఉద్యానవన పంటలకు ప్రభుత్వం ఊతం ఇస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యాన పంటలకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు లేక పోవడంతో డ్రిప్, స్ర్పింక్లర్ సిస్టం ద్వారా పండ్ల, కూరగాయల తోటలు సాగు చేయాలనుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యాన పంటలకు సబ్సిడీ స్కీంలను అమలు చేస్తోంది. ఈ మేరకు అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. దీంతో రైతులు ఉద్యానవన పంటల సాగుకు ముందుకు వస్తున్నారు.
డ్రిప్ ఇరిగేషన్కు..
డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి జిల్లాకు మొత్తం రూ.6.50 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు రూ.3.50 కోట్లకు సంబంధించిన పనులు మంజూరు చేశారు. ఇంకా రూ.3 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ లకు 100 శాతం, సన్న, చిన్న కారు, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఉంటుంది.
పండ్లు, కూరగాయ తోటలు, ఆయిల్పామ్కు దేనికైనా డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ప్రాంత హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రందించి దరఖాస్తు చేసుకోవచ్చు.
50 శాతం సబ్సిడీ
కూరగాయ తోటల సాగుకు సంబంధించి శాశ్వత పందిళ్లు (పెండాల్స్) నిర్మాణం కోసం 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఎకరాకు యూనిట్ కాస్ట్ రూ.2 లక్షలు అయితే అందులో 50 శాతం రూ.1 లక్ష సబ్సిడీ ఉంటుంది. ఎంత మంది రైతులు ముందుకు వచ్చినా పెండాల్స్ మంజూరు చేసే అవకాశం ఉంది.
ఫామ్ మెకనైజేషన్..
ఫామ్ మెకనైజేషన్కింద 50 శాతం సబ్సిడీపై బ్రష్ కటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలకు సంబంధించిన యంత్రాలకు మాత్రమే సబ్సిడీ స్కీమ్ వర్తిస్తుంది. ఆయా యంత్రాలు అవసరం అయిన రైతులు సంబంధింత హార్టికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (హెచ్ఈఓ)ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఫామ్ పండ్స్ నిర్మాణాలకు సైతం 50 శాతం సబ్సిడీ ఉంటుంది.
21 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతుతో ఫామ్ పండ్స్ నిర్మించుకోవాలి. నిర్ణీత సైజ్లో ఫామ్ పండ్స్ తవ్వాక అందులో హెచ్డీపీవీ షీట్ ఏర్పాటు చేసుకోవాలి. ఫామ్ పండ్ యూనిట్ కాస్ట్ రూ.1.50 లక్షలు కాగా అందులో 50 శాతం రూ.75 వేలు సబ్సిడీ ఉంటుంది. పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. కొత్తగా మామిడి, జామ, నిమ్మ, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ తోటల పెంపకానికి సబ్సిడీ వర్తిస్తుంది.
ఆయిల్పామ్ తోటలకు
ఆయిల్పామ్ తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. జిల్లాలో 2,500 ఎకరాల్లో ఆయిల్ పామ్తోటలు సాగుచేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 674 ఎకరాల్లో సాగు చేశారు. మరో 450 ఎకరాల్లో అయిల్పామ్ తోటల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు.
ఎకరాకు నాలుగేళ్ల వరకు రూ.50 వేల సబ్సిడీ లభిస్తుంది. నిజాంపేటలో 43 ఎకరాల్లో ఆయిల్పామ్ నర్సరీ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆయిల్పామ్ తోటలు సాగు చేసే రైతులకు అవసరమైన మొక్కలను అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు.
