మండలానికో సాండ్ బజార్.. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

మండలానికో సాండ్ బజార్.. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

జనగామ, వెలుగు: రాష్ట్రంలో ఇసుక బ్లాక్​మార్కెట్ దందాను అరికట్టేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లా, మండల కేంద్రాల్లో సాండ్​బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఒక్కో సాండ్​బజార్‎ను మూడు నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు రెండు రోజుల కింద స్థల సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు స్థలాల అన్వేషణ మొదలు పెట్టారు. ఇవి ప్రారంభమైతే ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది.

స్థలాల సేకరణలో అధికారులు  

తెలంగాణ మినరల్స్​ డెవలప్​ మెంట్​ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాండ్​ బజార్లను నిర్వహించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని కొన్ని ఏరియాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. సాండ్​ బజార్ల ఏర్పాటుకు ఆయా జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 

జనగామ కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్​ఏడీ విజయ్​కుమార్​జనగామ, స్టేషన్​ఘన్​పూర్​ఆర్డీఓలకు లేఖ రాశారు. వారు తహసీల్దార్లకు సూచించడంతో మండల కేంద్రాల్లో స్థలాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వీలైనంత త్వరలో ప్రక్రియ పూర్తైతే సాండ్​బజార్లు అమలులోకి వస్తాయి. కాగా మహబూబాబాద్​జిల్లా కేంద్రంలో ఇప్పటికే సాండ్​బజార్‎ను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు..

స్థలాలను పరిశీలిస్తున్నాం

జిల్లాలో సాండ్​బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నం. ప్రస్తుతానికి డివిజన్‎కు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. స్థల అన్వేషణ కోసం ఆర్డీఓలను ఆదేశించాం. జనగామ శివారు పసరమడ్లలో, స్టేషన్​ఘన్​పూర్​శివారుల్లో స్థలాలను పరిశీలిస్తున్నం. ఈ రెండు సాండ్​ బజార్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలాల్లోనూ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటాం. – రిజ్వాన్​ బాషా షేక్​, కలెక్టర్, జనగామ