రోగి భర్తపై డాక్టర్ ఇనుపరాడ్ తో దాడి

రోగి భర్తపై డాక్టర్ ఇనుపరాడ్ తో దాడి
  • నారాయణ ఖేడ్ గవర్నమెంట్ హాస్పిటల్​లో ఘటన

నారాయణఖేడ్, వెలుగు: తన భార్యకు ట్రీట్​మెంట్​ చేయమన్న భర్తపై ఓ ప్రభుత్వ డాక్టర్ ఇనుపరాడుతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గవర్నమెంట్​ ఏరియా హాస్పిటల్​లో శుక్రవారం సాయంత్రం జరిగింది. మనూర్ శల్గిరా గ్రామానికి చెందిన రోజి అనారోగ్యం కారణంగా ఆమె భర్త ప్రసాద్ ఖేడ్ ఏరియా హాస్పిటల్​ తీసుకువచ్చాడు. తన భార్య రోజి సీరియస్ గా ఉన్నందున రక్త పరీక్షలు చేయాలని అక్కడున్న డాక్టర్ రాజ్ కుమార్ ను కోరాడు.

డాక్టర్​ టైం అయిపోయింది రేపు పరీక్షలు చేస్తామని చెప్పాడు. కనీసం చీటీ రాసిస్తే బయట చేయించుకుంటామని ప్రసాద్​ ప్రాధేయపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ప్రసాద్ పై డాక్టర్​ రాజ్ కుమార్ ఇనుప రాడ్ తో దాడి చేసి గాయపరిచాడు. విషయం తెలుసుకున్న ఖేడ్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.