V6 News

సర్కారు ఉద్యోగులే టార్గెట్ గా లోన్ల దందా ..సిబిల్ స్కోర్ లేని ఎంప్లాయీసే టార్గెట్

సర్కారు ఉద్యోగులే టార్గెట్ గా లోన్ల దందా ..సిబిల్ స్కోర్ లేని ఎంప్లాయీసే టార్గెట్
  •      ఒక్కొక్కరి నుంచి లక్షల్లో వసూలు 
  •     పోలీసులను ఆశ్రయించిన బాధితులు

హైదరాబాద్, వెలుగు: బ్యాంకు లోన్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను ఓ కంపెనీ బురిడీ కొట్టించగా.. మోసపోయామంటూ బాధితులు ఎస్ఆర్​నగర్​ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. సిబిల్ స్కోర్ తక్కువగా ఉండి లోన్లు రాక ఇబ్బంది పడుతున్న ఉమ్మడి వరంగల్, నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని విద్యుత్, సింగరేణి, రైల్వే, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులకు ఓ కంపెనీ నుంచి కాల్స్​వెళ్లాయి. 

బ్యాంకుల నుంచి రూ.60 లక్షల పర్సనల్ లోన్లు ఇప్పిస్తామని, సమస్యలు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించింది. లోన్ మంజూరు కావాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చార్జీలు చెల్లించాలంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.5,900 వసూలు చేసింది. ఆపై డబ్బులు అకౌంట్లలో జమ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1.70 లక్షల దాకా తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత స్పందించడం మానేసింది. దీంతో హైదరాబాద్​ఎస్ఆర్​నగర్​లో ఉండే ఈ కంపెనీపై బాధితులు గురువారం ఎస్​ఆర్​నగర్​పోలీసులను ఆశ్రయించారు.