మంచిర్యాల జిల్లాలో లీడర్ల నిర్వాకం కలెక్టర్ల ఆర్డర్స్తో పనులకు బ్రేక్
గతంలో ఏసీడీపీ ఫండ్స్తో లీడర్ల పొలాలకు గ్రావెల్ రోడ్డు
మంచిర్యాల, వెలుగు: ఓవైపు రూరల్ ఏరియాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, ఆఫీసర్లు… మరోవైపు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుకూలంగా రోడ్లు వేయడం వివాదాస్పదంగా మారింది. తమ పవర్ను అడ్డం పెట్టుకొని సర్కారు సొమ్మును మిస్యూజ్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్లంపల్లి మండలం కన్నాల పంచాయతీ పరిధిలో నేషనల్ హైవే 363ని ఆనుకొని ఒక వెంచర్, కన్నాల ఎస్సీ కాలనీ దగ్గర్లో మరో వెంచర్ ఏర్పాటు చేశారు. డిస్ర్టిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) రూల్స్ మేరకు వెంచర్లకు 33 ఫీట్ల వెడల్పుతో రోడ్లు నిర్మించాలి. దీంతో లీడర్లు, రియల్టర్లు కలిసి సర్కారు గ్రాంట్తో రోడ్లు వేసేందుకు ప్లాన్ చేశారు. కన్నాల ఎస్సీ కాలనీకి రోడ్డు పేరిట నిరుడు పంచాయతీలో తీర్మానం చేయించి డిస్ర్టిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ)కి ప్రపోజల్స్ పంపారు. ఆ రోడ్ల నిర్మాణంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి శాంక్షన్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆఫీసర్లు అవేమీ పట్టించుకోలేదు. గ్రామాల్లో పది పదిహేను ఫీట్లకు మించి రోడ్లు లేవు. ఎస్సీ కాలనీ పేరిట మాత్రం 33 ఫీట్ల రోడ్లు సాంక్షన్ చేయడం విచిత్రం.
బిట్లుగా చేసి నామినేషన్పై అప్పగింత…
రెండు వెంచర్లకు డీఎంఎఫ్టీ గ్రాంట్ రూ.49 లక్షలతో సీసీ, మెటల్ రోడ్లు శాంక్షన్ చేశారు. అంచనా విలువ రూ.5లక్షలు దాటితే టెండర్లు పిలవాల్సి ఉంటుంది. దీంతో రూ.5లక్షల లోపు బిట్లుగా విభజించి నామినేషన్పై కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇటీవలే వెంచర్లలో రోడ్డు మెటల్ పోసి వర్క్ స్టార్ట్ చేశారు. అసలు విషయం లీక్ కావడంతో కలెక్టర్ భారతి హోళికేరి పనులు నిలిపివేసి, ఎంక్వైరీకి డిస్ర్టిక్ట్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (డీసీపీవో)కు ఆర్డర్స్ జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో, పంచాయతీరాజ్ ఏఈ సైట్ మీదికి వెళ్లి పరిశీలించి ఎస్సీ కాలనీ కోసమే రోడ్డు వేస్తున్నట్టు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై హయ్యర్ ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ డీటెయిల్డ్ రిపోర్టు అందించాలని ఆదేశించినట్టు సమాచారం. అలాగే ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు వర్క్ ఆపాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ బేఖాతరు చేశారు. రాత్రికిరాత్రే మెటల్ లెవలింగ్ చేయడంపై కలెక్టర్కు కంప్లైంట్ వెళ్లడంతో ఆగిపోయారు. మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండానే రోడ్లకు మొరం తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజాప్రతినిధికి గిఫ్ట్గా ప్లాట్లు…
డీఎంఎఫ్టీ ఫండ్స్తో రియల్ వెంచర్లకు రోడ్లు వేసేందుకు సాయం చేసిన రియల్టర్లు ఒక ప్రజా ప్రతినిధికి గిఫ్ట్గా ప్లాట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవే పక్కన ఉన్న వెంచర్లో నిర్మిస్తున్న ట్రిపుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఆయనదే అని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నామినేషన్పై వర్క్స్ ఇచ్చినందుకు కాంట్రాక్టర్లు రూ.70వేల దాకా ముట్టజెప్పినట్టు తెలిసింది.
గతంలో లీడర్ల భూములకు…
లీడర్లు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం ఇదే మొదటిసారి కాదు. మూడేళ్ల కిందట నెన్నెల మండల కేంద్రం శివారులోని గ్రావెల్ రోడ్డు పనిలో లీడర్ల కోసం రూ.13 లక్షల ఏసీడీపీ ఫండ్స్ను దుర్వినియోగం చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.