
నేలకొండపల్లి / కూసుమంచి/ఖమ్మం రూరల్/తల్లాడ, వెలుగు : విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, పేదల ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో 201 మందికి రూ.84.53లక్షల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం రూ.20లక్షలతో నిర్మించిన పల్లె దవాఖాన కొత్త భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన కొద్దికాలంలోనే ఆరోగ్యశ్రీని విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇంకా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసాను అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పేదల వైద్యానికి కూడా డబ్బులు వెచ్చించలేదని, తాము నిధులు కేటాయించి మంజూరు చేయిస్తున్నామని చెప్పారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు అసైన్డ్ భూములను పేదలకు పంచారని, కానీ వాటిని గత ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేశ్, నెల్లూరి భద్రయ్య, కూసుమంచి, నేలకొండపల్లి ఎంపీపీలు బాణోతు శ్రీనివాస్, వజ్జా రమ్య, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ ఖాజామియా, కొడాలి గోవిందరావు పాల్గొన్నారు.
జక్కంపూడి కుటుంబానికి పరామర్శ
ఇటీవల అనారోగ్యంతో సీనియర్ నాయకుడు జక్కంపూడి కృష్ణమూర్తి మృతి చెందగా అది తట్టుకోలేక ఆయన సతీమణి ప్రేమలత కూడా చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి పొంగులేటి ఆదివారం తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. నారాయణపురం గ్రామానికి చెందిన రెడ్డెంవీర నరసింహారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.
ఇండ్ల పట్టాలు పంపిణీ
ఖమ్మం మండలంలోని పోలేపల్లి లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన 18 మంది లబ్ధిదారులకు ఇంతవరకు పట్టాలు రాకపోవడంతో మంత్రి దృష్టికి తెచ్చారు. దీనికి స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి అందరికీ పట్టాలు మంజూరు చేయించారు. వాటిని ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి పట్టాలు పంపిణీ చేశారు.