- సమస్యల పరిష్కారానికి అడ్డుపడుతున్నడు
- 7 డిమాండ్లు.. 15 రోజుల డెడ్లైన్
- డిమాండ్లకు ఒప్పుకోకపోతే నిరవధిక సమ్మె చేస్తమని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు : మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ రమేశ్రెడ్డిని ఆ పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గవర్నమెంట్డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మొత్తం ఏడు డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం హెల్త్ సెక్రటరీకి అందజేశారు. జనరల్ ట్రాన్స్ఫర్లు, పీఆర్సీ బకాయిలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఈఎల్ ఎన్క్యాష్మెంట్, యూనిఫార్మ్ హెచ్ఆర్ఏ, సకాలంలో ప్రమోషన్లు (కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్), డీఎంఈ పోస్టుల క్రియేషన్ వంటి డిమాండ్లను 15 రోజుల్లో నెరవేర్చాలని నోటీసులో డెడ్లైన్ ఇచ్చారు. లేకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. హెల్త్ సెక్రటరీని కలవడానికి ముందు డీఎంఈ రమేశ్రెడ్డిని కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు.. ఆయనకు కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. అనంతరం ఆ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో డీఎంఈ సరిగా వ్యవహరించడం లేదని అన్నారు. ఆయనకు కావాల్సిన జీవోలు తెప్పించుకుంటున్నారని, డాక్టర్లకు అవసరమైన విషయాల్లో కావాలనే తాత్సారం చేస్తున్నారని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ తిరుపతిరావు ఆరోపించారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన డాక్టర్లతో డీఎంఈ దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కావాల్సిన వాళ్లకు హైదరాబాద్లో పోస్టింగులు ఇచ్చి, ఇతరులకు జిల్లాల్లో పోస్టింగ్స్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డీఎంఈ రమేశ్రెడ్డిని తొలగించడమే తమ ప్రధాన డిమాండుగా పెట్టుకున్నామని, ఇదే విషయాన్ని హెల్త్మినిస్టర్హరీశ్రావు దృష్టికి కూడా తీసుకెళ్లామని వారు చెప్పారు. రమేశ్రెడ్డి ఇంచార్జ్ డీఎంఈగా ఐదేండ్లుగా ఉన్నారని, ఇకనైనా రెగ్యులర్ డీఎంఈ పోస్టు క్రియేట్ చేసి అర్హులైన వారికి ఆ పోస్టు ఇవ్వాలని కోరారు. రమేశ్రెడ్డి కన్నా సీనియర్లు, బడుగుబలహీన వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు ఎంతో మంది డీఎంఈ పోస్టుకు అర్హులుగా ఉన్నారన్నారు. అలాగే ఈవినింగ్ ఓపీ సహా ఏ పని అయినా చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు.
అవి నా పరిధిలోని అంశాలు కావు: డీఎంఈ
సమ్మె నోటీసులో పేర్కొన్న అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని డీఎంఈ రమేశ్రెడ్డి అన్నారు. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇప్పటికే అమలు చేస్తున్నామని, యూజీసీ రూల్స్ ప్రకరాం లీవ్ ఎన్క్యాష్మెంట్ సాధ్యం కాదని ‘వెలుగు’కు ఆయన చెప్పారు. యూనిఫార్మ్ హెచ్ఆర్ఏ దేశంలోనే ఎక్కడా లేదని, జనరల్ ట్రాన్స్ఫర్లు, పీఆర్సీ బకాయిలు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ సీఎం స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అని, వాటన్నింటినీ తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి వేయాలని, డ్యూటీ టైమ్లో కచ్చితంగా హాస్పిటల్లోనే ఉండాలని ఒత్తిడి చేస్తుండడం వల్లే, ఆ పని చేయడం ఇష్టంలేని కొంత మంది తనను టార్గెట్ చేస్తున్నారని డీఎంఈ ఆరోపించారు.