- ఇంజినీర్ సంఘాల అభ్యంతరం
హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ సీఈ విజయ్ భాస్కర్ రెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇంకో ఏడాది పొడిగించింది. 2024 అక్టోబరులోనే ఆయన రిటైర్ అయినా.. ప్రభుత్వం ఆయనకు ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. తాజాగా మరో ఏడాది పాటు ఆయనను కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగిస్తున్నట్టు శనివారం ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆయన 2027 మార్చి 31 వరకు పదవిలో కొనసాగనున్నారు.
ఇటు రిటైర్డ్ సీఈ భీమ్ ప్రసాద్ నూ అదే టైం వరకు మంత్రికి ఓఎస్డీగా పదవీకాలం పెంచారు. అయితే రిటైర్ అయిన అధికారులకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడంపై ఇంజినీరింగ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా రిటైర్ అయిన వారికి ఎక్స్ టెన్షన్ ఎలా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ టెన్షన్లు ఇవ్వబోమని అధికారంలోకి వచ్చాక సీఎం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
