బీఆర్ఎస్ హయాంలో చెట్టు పన్ను రద్దు: పద్మారావు గౌడ్

బీఆర్ఎస్ హయాంలో చెట్టు పన్ను రద్దు:  పద్మారావు గౌడ్

సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గీత కార్మికుల కోసం చెట్టు పన్ను  రద్దు చేశామని డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్అన్నారు. తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ తో  మాట్లాడి చెట్టు పన్ను రద్దు చేయించానన్నారు. ఆదివారం సిద్దిపేటలో మంత్రి హరీశ్​ రావు తో కలసి  గౌడ ఏసీ కన్వెన్షన్ హాల్ ను ప్రారంభి మాట్లాడారు. గౌడ కులస్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను  ప్రారంభించిదన్నారు.

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో గౌడ కులస్తులకు ఏసీ కన్వెన్షన్ హాల్ నిర్మించడం  సంతోషంగా ఉందన్నారు.  హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే  అన్ని రకాల అభివృద్ధి కనబడుతుందని దీనికి మంత్రి హరీశ్​ రావే కారణమన్నారు. మంత్రి హరీశ్​ రావు మాట్లాడుతూ  లంచం కోసం ఆనాటి పాలకులు   కల్లు డిపోలను మూసి వేయిస్తే, నేడు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో  గౌడ కులస్తులకు  రిజర్వేషన్ కల్పించిందన్నారు.  

ALSO READ :బిట్​ బ్యాంక్​ : నిజాం రాజ్యంలో పారిశ్రామీకరణ

రూ. 3 కోట్లతో త్వరలో  ట్యాంక్ బండి పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని సీఎం  కేసీఆర్ నెలకొల్పుతున్నారని వెల్లడించారు.  కార్యక్రమంలో   జడ్పీ చైర్​ పర్సన్​ రోజా శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ శాశనమండలి చైర్మన్ స్వామి గౌడ్,  గీత పరిశ్రమిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్  పాల్గొన్నారు. అంతకు ముందు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.