
- సర్కారు రేటు కన్నా 4.95 శాతం ఎక్కువకు కోట్ చేసిన కంపెనీ
- త్వరలో ఆ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్
- రాజేంద్ర నగర్లో వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు బిల్డింగ్
హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు నిర్మాణ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. నిర్మాణ కాంట్రాక్టు టెండర్ను డీఈసీ ఇన్ ఫ్రా దక్కించుకుంది. ఎన్సీసీతో పాటు డీఈసీ మాత్రమే టెండర్లు దాఖలు చేయగా, డీఈసీకి టెండర్ దక్కిందని ఆర్ అండ్ బీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు బిల్డింగ్కు రూ.2,583 కోట్లకు అడ్మినిస్ర్టేటివ్ సాంక్షన్ ఇస్తూ గత ఏడాది డిసెంబరులో లా సెక్రటరీ తిరుపతి జీఓ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా అర్ అండ్ బీ అధికారులు టెండర్లు పిలవగా.. కమిషనర్ ఆఫ్ టెండర్స్ లో డీఈసీ అర్హత పొందింది.
సివిల్ పనుల కోసం రూ.1,980 కోట్లు, ఫర్నిచర్తో పాటు ఇతర ఖర్చుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జీఎస్టీ మినహాయించి రూ.1,443 కోట్లకు టెండర్ పిలవగా డీఈసీ 4.95 శాతం ఎక్కువకు కోట్ చేసి టెండర్ దక్కించుకుందని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు వెల్లడించారు. డీపీఆర్ ఖరారు బాధ్యతలు వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించగా ఆ సంస్థ పలు డిజైన్లు ఖరారు చేసింది. ఆ డిజైన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీ ముందు కన్సల్టెన్సీ, ఆర్ అండ్ బీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా కమిటీ ఒక డిజైన్ ను ఫైనల్ చేసింది.
కొత్త హైకోర్టులో కోర్టు హాల్స్, జడ్జిల నివాసాలు, బార్ కౌన్సిల్ బిల్డింగ్, అడ్వొకేట్లకు లైబ్రరీ, సుమారు 3 వేల బైకుల పార్కింగ్, 1500 కార్లు ఉంచేలా మొత్తం 40 బిల్డింగ్స్ ను నిర్మించనున్నారు. కాగా.. రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం 29 మంది జడ్జిలున్నారు. భవిష్యత్తులో జడ్జిల పోస్టులు పెరుగుతున్న నేపథ్యంలో 60 మంది జడ్జిలకు సరిపోను కోర్టు హాల్స్ ను కొత్త హైకోర్టులో నిర్మించనున్నారు.