
- ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ క్యాంపులు బంద్
- డీపీఎల్ ఆపరేషన్లు నిలిపివేసిన సర్కార్
- ఇబ్రహీంపట్నం ఘటనతో 6 నెలల కింద నిర్ణయం
- డీపీఎల్ సర్జరీల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది
- తప్పని పరిస్థితుల్లో ట్యూబెక్టమీ చేయించుకుంటున్న కొందరు మహిళలు
కామారెడ్డి, వెలుగు: గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీల కోసం నిర్వహించిన డీపీఎల్ (డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోపిక్) క్యాంపులను ప్రభుత్వం బంద్ పెట్టింది. ఆరు నెలల కింద రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా క్యాంపులు నిలిపివేసింది. దీంతో వేలాది మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. సిజేరియన్ డెలివరీ అయిన వాళ్లలో కొంతమంది మాత్రం ట్యూబెక్టమీ చేయించుకుంటుండగా, మరికొందరు డీపీఎల్ సర్జరీ కోసం వేచిచూస్తున్నారు. డీపీఎల్ అంటే కోతలు లేకుండా లాప్రోస్కోపిక్పద్ధతిలో ఆపరేషన్చేస్తారు. కేవలం 15 నిమిషాల్లో సర్జరీ పూర్తవుతుంది. అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు.. పనులు చేసుకోవచ్చు. కానీ ట్యూబెక్టమీ అయితే మత్తు ఇంజక్షన్ ఇస్తారు. కనీసం 5 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలి. దీనికి తోడు ఈ సర్జరీ తర్వాత చాలామంది నడుము నొప్పి లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలామంది డీపీఎల్ సర్జరీల వైవే మొగ్గు చూపుతున్నారు.
రిపోర్టు బయటకు రాలే..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోయినేడాది ఆగస్టు 25న డీపీఎల్క్యాంపు నిర్వహించారు. ఆ రోజు 34 మంది మహిళలకు సర్జరీ చేశారు. అయితే వారిలో 25 మందికి ఇన్ఫెక్షన్ సోకగా, కండిషన్ సీరియస్ గా మారి నలుగురు చనిపోయారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా డీపీఎల్క్యాంపులను నిలిపివేయాలని సర్కార్ ఆదేశించింది. అనంతరం హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు ఆధ్యర్యంలో ఎంక్వైరీ కమిటీ వేశారు. కానీ ఇప్పటివరకు ఆ కమిటీ రిపోర్ట్బయటకు రాలేదు. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గానీ, ఆ శాఖ ఉన్నతాధికారులు గానీ డీపీఎల్ క్యాంపుల నిర్వహణపై కనీసం రివ్యూ చేయలేదు.
స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత
ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నెలకు ఒకట్రెండు సార్లు డీపీఎల్ క్యాంపులు నిర్వహించేవారు. ఎప్పుడు? ఎక్కడ? క్యాంపు నిర్వహించేది ముందుగానే జిల్లాలోని హెల్త్ స్టాఫ్ కు సమాచారం ఇచ్చేవారు. ఆయా పీహెచ్సీల పరిధిలో ఆపరేషన్ చేయించుకునే వారిని సిబ్బంది క్యాంపుకు తరలించేవారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్లు మాత్రమే డీపీఎల్ సర్జరీలు చేస్తారు. పీహెచ్సీల్లో పనిచేసే హెల్త్ ఆఫీసర్లకే ఈ ట్రైనింగ్ఇచ్చారు. గతంలో జిల్లాకు ఒకరిద్దరు ట్రైనింగ్తీసుకున్న డాక్టర్లు ఉండేవారు. కొందరు రాజీనామా చేయడం, కొందరు రిటైర్డ్ కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో నలుగైదుగురు మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. వారే జిల్లాల్లో క్యాంపులకు వచ్చేవారు.
50 వేల మందికి పైగా వెయిటింగ్
ఒక్క కామారెడ్డి జిల్లాలోనే రెండు వేల మంది మహిళలు ఫ్యామిలీ ప్లానింగ్సర్జరీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగాఈ సంఖ్య 50 వేలకు పైగానే ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో గత ఐదు నెలల్లో 12 వేల వరకు డెలివరీలు జరిగాయి. వీరిలో కొంతమంది ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో డీపీఎల్ సర్జరీలు చేసే నిపుణులు కూడా లేరు. గతంలో హైదరాబాద్నుంచి డాక్టర్జోయల్వచ్చి డీపీఎల్ ఆపరేషన్లు చేసేవారు. ఇబ్రహీంపట్నంలోనూ డాక్టర్ జోయల్ నే ఆపరేషన్లు చేయగా, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
సర్కార్ ఆదేశిస్తే మళ్లీ క్యాంపులు
ఇప్పుడైతే డీపీఎల్ క్యాంపులు నిర్వ హించడం లేదు. సర్కార్ ఆదేశాలిస్తే, మళ్లీ క్యాంపులు ఏర్పాటు చేస్తం. ట్యూబెక్టమీ ఆపరేషన్లు మాత్రం యథావిధిగా జరుగుతున్నాయి.
‑ డాక్టర్ లక్ష్మణ్ సింగ్, డీఎంహెచ్వో, కామారెడ్డి జిల్లా