ఢాకా: బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా బీఎన్పీ సీనియర్ లీడర్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ ఎన్నికయ్యారు. గురువారం (ఆగస్ట్ 20) బంగ్లా పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో (255 ఓట్లు) ఆయన విజయం సాధించారు. ఆలంఘీర్ ప్రత్యర్థి, విపక్ష కూటమి అభ్యర్థి ఓలీ అహ్మద్కు 88 ఓట్లు పడ్డాయి. బంగ్లా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎస్ఎం నాసిర్ ఉద్దీన్ పర్యవేక్షణలో గురువారం (ఆగస్ట్ 20) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 343 మంది చట్టసభ సభ్యులు తమ హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఫలితాలను ప్రకటించి.. ఆలంఘీర్ను దేశ నూతన అధ్యక్షుడిగా లాంఛనంగా అనౌన్స్ చేశారు. 2026, ఆగస్ట్ 21న ఆలంఘీర్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మొహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బంగ్లాదేశ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన ఐదేళ్ల పదవి కాలం పూర్తి కాకముందే ఆయన పదవి నుంచి వైదొలిగారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది.
గత 35 ఏళ్లలో బంగ్లాదేశ్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికకు దూరంగా ఉండటంతో పోటీ ఏకగ్రీవమయ్యేది. కానీ ఈ సారి మాత్రం అధికార బీఎన్పీ నుంచి మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్, విపక్ష కూటమి అభ్యర్థిగా ఓలీ అహ్మద్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు.
