
TSPSC పేపర్ లీకేజీ ఘటనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు . 48 గంటల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని TSPSC ని ఆదేశించారు. పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టాలిని సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు నమ్మకం కలిగించేలా చూడాలని అన్నారు.
మరోవైపు టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో వదంతులు నమ్మొద్దని ఛైర్మన్ జనార్దన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కమిషన్లో నమ్మిన వాళ్లే గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 30లక్షల మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ వన్టైమ్ రిజిస్ట్రేషన్ను యూపీఎస్సీ కూడా మెచ్చుకుందని తెలిపారు. తెలంగాణ వచ్చాక దాదాపు 35వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన.. . ప్రస్తుతం దాదాపు 25వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. అసిస్టెంట్ ఇంజనీర్(AE) పరీక్ష రద్దుపై మార్చి 15న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పూర్తి నివేదిక వచ్చాకా ఎగ్జామ్ రద్దు చేయాలా వద్దా అనేది చెప్తామన్నారు.
ఇక తమ కుటుంబ సభ్యులెవరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలేదని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తన కూతురు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పేపర్ లీక్ కేసును సిట్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు టీఎస్ పీఎస్సీ ద్వారా 26 నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. గ్రూప్ 1 లో నిందితుడు ప్రవీణ్ కు వచ్చిన 103 మార్కులే టాప్ మార్కులు కావన్నారు. ప్రవీణ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు.