తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో రాష్ట్ర మూడవ శాసనసభ మొదటి సమావేశాన్ని నిర్వహించాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ శాసనసభ మొదటి సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగానే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించింది. దీంతో డిసెంబర్ 9వ తేదీ ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించనున్నారు. కొత్త స్పీకర్ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు.