హైదరాబాద్, వెలుగు:తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని గవర్నర్ తమిళిసై అన్నారు. బుధవారం73వ రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఎగరేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు సికింద్రాబాద్లోని సైనిక అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళి అర్పించారు. రాజ్భవన్ లాన్స్లో నిర్వహించిన వేడుకకు హాజరైన గవర్నర్కు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎనిమిది మెడికల్ కాలేజీలు ఇచ్చిందన్నారు. కరోనా కష్టకాలంలో ముందుండి పనిచేసిన ఫ్రంట్లైన్ వారియర్స్ను అభినందించారు.
త్వరలోనే 200 కోట్ల డోసులు
ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని తమిళిసై అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని గౌరవిస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకువచ్చిన ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ను దేశం సమర్థంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని, త్వరలోనే 200 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. మన దేశంలో తయారైన కరోనా వ్యాక్సిన్లను 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగస్వాములుగా ఉన్న సైంటిస్టులు, డాక్టర్లు, నర్స్లు, ఇతర పారా మెడికల్ స్టాఫ్ను అభినందించారు. ఇండియా ఫార్మసీ ఆఫ్ వరల్డ్, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మారిందన్నారు.
ఇన్నోవేషన్ హబ్గా దేశం
సరిహద్దుల్లో ఎదురైన సవాళ్లను దేశం సమర్థవంతంగా ఎదుర్కొందని, డిఫెన్స్ సెక్టార్లో ఆత్మనిర్భరత సాధించామని గవర్నర్ తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే బలమైన శక్తులలో ఒకటిగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్లో దేశం ముందువరుసలో నిలిచిందన్నారు. స్టార్టప్ ఇండియా చర్యలతో దేశం ఇన్నోవేషన్ హబ్గా మారుతున్నదన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ దేశం ఆర్థికంగా ఎదుగుతోందన్నారు.
గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతున్నం
రాష్ట్రంలోని గిరిజనులకు పోషకాహారం అందించేందుకు రాజ్భవన్ అనేక చర్యలు చేపట్టిందని గవర్నర్ వివరించారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని గిరిజనుల జీవన ప్రమాణాలు, హెల్త్ పెంపొందించేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టామన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలోనే యంగెస్ట్ స్టేట్గా ఉన్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఫార్మా, ఐటీ, మెడికల్ హబ్గా రాష్ట్రం అవతరించిందని, ఇక్కడ అనేక గ్లోబల్ కార్పొరేట్ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం విద్యావ్యవస్థలో ముందంజలో ఉందన్నారు.