
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీలు సాధించినంత మాత్రాన ఉద్యోగాలు రావని, సరైన స్కిల్స్ పెంచుకుంటేనే మంచి జాబ్స్ వస్తాయని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రపంచానికి స్కిల్స్ ఉన్న హ్యూమన్ రిసోర్స్ ను అందించే దేశంగా ఇండియా అభివృద్ధి చెందుతోందని, ఇందుకోసం నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ ద్వారా 40 కోట్ల మందికి ట్రెయినింగ్ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని గవర్నర్ చెప్పారు. “కామరాజార్ జన్మదినం, ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ డే, వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్ మెంట్” అంశంపై బుధవారం మధురై కామరాజ్ యూనివర్సిటీ, దేశీయ చింతనై కళగం సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆన్ లైన్ లో ప్రసంగించారు. “స్వామి వివేకానంద ఒకసారి తన పర్యటనలో టార్గెట్ ని సరిగ్గా కాల్చలేకపోతున్న షూటర్లను చూశారు. నేను గురి చూసి కాల్చగలను గన్ ఇస్తారా? అని వారిని అడిగారు. కాషాయ బట్టలు వేసుకున్న సన్యాసి గన్ సరిగ్గా పేలుస్తాడా? అని వారు హేళన చేస్తూనే గన్ ఇచ్చారు. స్వామి సరైన ఫోకస్ తో గురిచూసి కాల్చారు. ఇది మీకెలా సాధ్యమైందంటూ వారు షాక్ తో అడిగారు. మెడిటేషన్ చేయడం వల్ల నాకు టార్గెట్ పై ఫోకస్ చేయగల శక్తి వచ్చింది. అందుకే టార్గెట్ ను గురి తప్పకుండా కాల్చగలిగానని స్వామి చెప్పారు” అని తమిళిసై వివరించారు. యువత కూడా రోజూ మెడిటేషన్ చేస్తే ఏకాగ్రతను పెంచుకోవచ్చని ఆమె సూచించారు.
కామరాజ్ అందరికీ స్ఫూర్తి..
తమిళనాడు మాజీ సీఎం, భారతరత్న కామరాజ్ గొప్ప స్ఫూర్తినిచ్చే నాయకుడని గవర్నర్ తమిళిసై కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితం, పారదర్శక పాలనతో తమిళనాడుకు, దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారని అన్నారు. స్టూడెంట్స్ కు మధ్యాహ్న భోజనం, అందరికీ విద్య, బలహీన వర్గాల విద్యపై ప్రత్యేక దృష్టి, ఇరిగేషన్, పరిశ్రమల అభివృద్ధితో కామరాజ్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
For More News..