న్యూఢిల్లీ : ఇథనాల్ తయారీకి చెరకు రసాన్ని ఉపయోగించడంపై నిషేధాన్ని రద్దు చేస్తూ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2023-–24 సరఫరా సంవత్సరంలో దీనిని ఉత్పత్తి చేయడానికి బీ–-హెవీ మొలాసిస్ కూడా ఉపయోగించుకోవచ్చు. దేశీయ మార్కెట్లో తగినంత చక్కెర సరఫరాను ఉంచడానికి, ధరలను కంట్రోల్ చేయడానికి 2023-–24 సరఫరా సంవత్సరానికి (నవంబర్–-అక్టోబర్) చెరకు రసం, చక్కెర సిరప్ను ఇథనాల్తయారీకి ఉపయోగించడాన్ని కేంద్రం నిషేధించిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది.
కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత ఆహార మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని ఓఎంసీలను కోరింది. సవరించిన కాంట్రాక్టులు అందిన తర్వాత చక్కెర మిల్లులు, డిస్టిలరీలు నిబంధనల ప్రకారం ఓఎంసీలకు ఇథనాల్ సరఫరా చేస్తాయి. రెక్టిఫైడ్ స్పిరిట్, అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ ఉత్పత్తికి మాత్రం చెరకు రసం, బి–హెవీ మొలాసిస్ల మళ్లింపు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని మొలాసిస్ ఆధారిత డిస్టిలరీలు, సి–-హెవీ మొలాసిస్ నుంచి ఇథనాల్ను తయారు చేయడానికి ప్రయత్నిస్తాయి.
శుక్రవారం జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ప్రస్తుత 2023–-24 సరఫరా సంవత్సరంలో 17 లక్షల టన్నుల వరకు చక్కెర మళ్లింపునకు అనుమతించామని, చెరకు రసం, బి–హెవీ మొలాసిస్ రెండింటినీ ఉపయోగించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. చక్కెర ఉత్పత్తి గత సీజన్లో 37.3 మిలియన్ టన్నులు ఉండగా, 2023--–24 సీజన్లో (అక్టోబర్--సెప్టెంబర్) 32.3-33 మిలియన్ టన్నులకు తగ్గుతుందని అంచనా.