సొసైటీ గ్రౌండ్​లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సొసైటీ గ్రౌండ్​లో ఘనంగా  బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్​ బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీ గ్రౌండ్​లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలతో దేవుళ్లను పూజించే పండుగ బతుకమ్మ అని, చిన్నప్పుడు సద్దుల బతుకమ్మ కోసం ఎదురుచూసేవాళ్లమని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద  కేంద్ర ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ కార్యక్రమానికి తెలుగువారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన చింతల రామచంద్రారెడ్డిని కిషన్ రెడ్డి అభినందించారు.