
ఆరేండ్లుగా అల్లర్లు లేవని చెప్తున్న సర్కారు ఇప్పుడే అల్లర్ల మాటెందుకెత్తుకుంది? ఎలక్షన్ ప్రచారం హోరెత్తిన టైంలో సీఎం వ్యాఖ్యల వెనుక మతలబేంది? ప్రజల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకత, ప్రతిపక్షాలకు వస్తున్న ఆదరణను సైడ్ట్రాక్ పట్టించేందుకేనా? కావాలనే సర్కార్ ఈ కొత్త నాటకం ఆడుతోందంటున్న ప్రతిపక్షాలు
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. మత కల్లోలాలు జరుగుతాయని, శాంతి భద్రతలకు ముప్పు ఉందన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఆఫీసర్లతో రివ్యూ చేసి, బెంబేలెత్తించటం వెనుక మర్మమేమిటీ..? అసలు ఎవరు కుట్ర చేస్తున్నారు..? ఎవరికి లాభం జరుగుతుంది..? అనే సందేహాలు గ్రేటర్ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిన ఈ టైమ్లో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పట్ల ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో అల్లర్లు జరుగుతాయనే సమాచారానికి సోర్స్ ఏమిటో సీఎం కేసీఆర్ వెల్లడించాలని, ఎవరు అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారో బయటపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు అరాచక శక్తులకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ మహేందర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఎందుకీ అల్లర్ల ప్రచారం..
అల్లర్ల ఊసు, జాడ లేకుండానే టీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం తెరపైకి తెచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ మత కల్లోలాలు, అల్లర్లేవీ జరగలేవని, సేఫ్ హైదరాబాద్ ఉందని చెప్తున్న సర్కార్.. ఇప్పుడు ఉన్నట్టుండి అల్లర్ల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.
గ్రేటర్లో టీఆర్ఎస్పై పెరిగిన వ్యతిరేకత నుంచి ఓటర్ల దృష్టి మళ్లించేందుకే ఈ నాటకమాడుతోందనే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్ హీట్ పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఎన్నికల సెగ తగిలినట్లుగా టీఆర్ఎస్ ప్రచార శక్తులన్నీ ప్రయోగిస్తోంది. దుబ్బాక బైఎలక్షన్లో టీఆర్ఎస్ను ఓడించిన బీజేపీ.. అదే జోష్ లో గ్రేటర్లో పుంజుకుంది. ప్రతిపక్షాల దూకుడు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ను వేలెత్తి చూపటం ప్రభుత్వ పెద్దలకు మింగుడుపడటం లేదు. అందుకే అల్లర్ల ప్రచారం తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అడ్వాన్సు ప్లాన్ బెడిసికొట్టిందా?
జీహెచ్ఎంసీ ఎలక్షన్ షెడ్యూల్ను గతంలో ఎన్నడూ లేనంత ఆగమాగంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయించింది. ప్రతిపక్షాలు తేరుకునేలోగా ఎన్నికలను ముగించాలని ప్లాన్ చేసుకుంది. షెడ్యూల్ రోజునే నోటిఫికేషన్ ఇచ్చి.. పది రోజుల్లోనే ఎన్నికల ప్రాసెస్ పూర్తయ్యేలా ఉరుకులు పరుగులు పెట్టించింది. దీంతో ప్రతిపక్షాలకు టైమ్ దొరక్కుండా చేయటంతోపాటు, వారికి అభ్యర్థుల ఎంపిక కూడా కష్టమవుతుందని అంచనా వేసింది. ప్రచార పర్వంలో మొత్తం తమదే పైచేయి ఉంటుందని భావించింది. కానీ ప్లాన్ రివర్సయింది. అన్ని చోట్ల ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపటంతోపాటు గట్టి పోటీనిస్తుండటంతో రాష్ట్ర మంత్రులు కూడా షాక్కు గురవుతున్నారు. దుబ్బాకలో ఓటమిని తెరమరుగు చేయటంతోపాటు గ్రేటర్లో బీజేపీ పుంజుకునేందుకు టైమ్ ఇవ్వకూడదని టీఆర్ఎస్ డబుల్ ధమాకా ప్లాన్ చేసుకుంది. అయితే.. అన్ని చోట్లా బీజేపీ బలంగా పోటీలో నిలువటంతో ప్రచార పర్వంలోనే టీఆర్ఎస్ లీడర్లు తలపట్టుకుంటున్నారు. అందుకే సర్కారు అల్లర్ల కార్డు ప్రయోగించిందనే అభిప్రాయాలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Read More News….