గ్రేటర్ ఎన్నికలు: ఎవరిది కుట్ర.. ఎవరికి లాభం?

గ్రేటర్ ఎన్నికలు: ఎవరిది కుట్ర.. ఎవరికి లాభం?

ఆరేండ్లుగా అల్లర్లు లేవని చెప్తున్న సర్కారు ఇప్పుడే అల్లర్ల మాటెందుకెత్తుకుంది? ఎలక్షన్​ ప్రచారం హోరెత్తిన టైంలో సీఎం వ్యాఖ్యల వెనుక మతలబేంది? ప్రజల్లో టీఆర్​ఎస్​పై వ్యతిరేకత, ప్రతిపక్షాలకు వస్తున్న ఆదరణను సైడ్​ట్రాక్​ పట్టించేందుకేనా? కావాలనే సర్కార్​ ఈ కొత్త నాటకం  ఆడుతోందంటున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీ ఎలక్షన్స్​ వాయిదా వేసేందుకు కుట్ర జరుగుతోందని స్వయంగా  రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్న తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. మత కల్లోలాలు జరుగుతాయని, శాంతి భద్రతలకు ముప్పు ఉందన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ పోలీస్​ ఆఫీసర్లతో రివ్యూ చేసి, బెంబేలెత్తించటం వెనుక మర్మమేమిటీ..?  అసలు ఎవరు కుట్ర చేస్తున్నారు..? ఎవరికి లాభం జరుగుతుంది..? అనే సందేహాలు గ్రేటర్​ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నాయి. ఎలక్షన్​ క్యాంపెయిన్​ హోరెత్తిన ఈ టైమ్​లో ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పట్ల ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్​లో అల్లర్లు జరుగుతాయనే సమాచారానికి సోర్స్​ ఏమిటో సీఎం కేసీఆర్​ వెల్లడించాలని,  ఎవరు అల్లర్లకు ప్లాన్​ చేస్తున్నారో బయటపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సవాల్​ విసిరారు. మరోవైపు అరాచక శక్తులకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ మహేందర్​రెడ్డి ప్రెస్​మీట్ పెట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఎందుకీ అల్లర్ల ప్రచారం..

అల్లర్ల ఊసు, జాడ లేకుండానే టీఆర్​ఎస్​ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారం తెరపైకి తెచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచీ మత కల్లోలాలు, అల్లర్లేవీ జరగలేవని, సేఫ్​ హైదరాబాద్​ ఉందని చెప్తున్న సర్కార్​.. ఇప్పుడు ఉన్నట్టుండి అల్లర్ల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.

గ్రేటర్​లో టీఆర్​ఎస్​పై పెరిగిన వ్యతిరేకత నుంచి ఓటర్ల దృష్టి మళ్లించేందుకే ఈ నాటకమాడుతోందనే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్​ఎంసీ ఎలక్షన్​ హీట్​ పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఎన్నికల సెగ తగిలినట్లుగా టీఆర్​ఎస్​ ప్రచార శక్తులన్నీ ప్రయోగిస్తోంది. దుబ్బాక బైఎలక్షన్​లో టీఆర్​ఎస్​ను ఓడించిన బీజేపీ.. అదే జోష్ లో గ్రేటర్​లో పుంజుకుంది. ప్రతిపక్షాల దూకుడు, సోషల్​ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం టీఆర్​ఎస్  ఫెయిల్యూర్స్​ను వేలెత్తి చూపటం ప్రభుత్వ పెద్దలకు మింగుడుపడటం లేదు. అందుకే అల్లర్ల ప్రచారం తెరపైకి తెచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.

అడ్వాన్సు ప్లాన్​ బెడిసికొట్టిందా?

జీహెచ్​ఎంసీ ఎలక్షన్​ షెడ్యూల్​ను గతంలో ఎన్నడూ లేనంత ఆగమాగంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్​ చేయించింది. ప్రతిపక్షాలు తేరుకునేలోగా ఎన్నికలను ముగించాలని ప్లాన్​ చేసుకుంది. షెడ్యూల్​ రోజునే నోటిఫికేషన్​ ఇచ్చి.. పది రోజుల్లోనే ఎన్నికల ప్రాసెస్​ పూర్తయ్యేలా ఉరుకులు పరుగులు పెట్టించింది. దీంతో ప్రతిపక్షాలకు  టైమ్​ దొరక్కుండా చేయటంతోపాటు, వారికి అభ్యర్థుల ఎంపిక కూడా కష్టమవుతుందని అంచనా వేసింది. ప్రచార పర్వంలో మొత్తం తమదే పైచేయి ఉంటుందని భావించింది. కానీ ప్లాన్​ రివర్సయింది. అన్ని చోట్ల ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపటంతోపాటు గట్టి పోటీనిస్తుండటంతో రాష్ట్ర మంత్రులు కూడా షాక్​కు గురవుతున్నారు. దుబ్బాకలో ఓటమిని తెరమరుగు చేయటంతోపాటు గ్రేటర్​లో బీజేపీ పుంజుకునేందుకు టైమ్​ ఇవ్వకూడదని టీఆర్​ఎస్​ డబుల్​ ధమాకా ప్లాన్​ చేసుకుంది. అయితే.. అన్ని చోట్లా బీజేపీ బలంగా పోటీలో నిలువటంతో ప్రచార పర్వంలోనే టీఆర్​ఎస్​ లీడర్లు తలపట్టుకుంటున్నారు. అందుకే సర్కారు అల్లర్ల కార్డు ప్రయోగించిందనే అభిప్రాయాలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Read More News….

ఆ రైలు పరుగుల వెనుక ‘‘పింక్ గ్యాంగ్’’

ఆక్సిజన్ ట్రీట్ మెంట్ తో వయసు​ తగ్గించొచ్చట

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?