హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన రూ.19 కోట్లకు పైగా క్యాష్, నగలను గ్రీవెన్స్ కమిటీ విడుదల చేసింది. మంగళవారం గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని ఆయా ప్రాంతాల్లో నిఘా బృందాలు క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధం లేని క్యాష్, నగలను జిల్లాల్లోని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ విడుదల చేస్తుందన్నారు.
ఇందులో భాగంగా రూ.33 కోట్ల 95 లక్షల 7 వేల విలువైన క్యాష్, నగలకు సంబంధించి 206 అప్పీళ్లు వచ్చాయన్నారు. అయితే, 181 అప్పీళ్లకు సంబంధించిన రూ.19 కోట్ల 4 లక్షల 31వేల క్యాష్, నగలను విడుదల చేశామన్నారు. రూ.14 కోట్ల 58 లక్షల 65 వేల 238 క్యాష్, నగలకు సంబంధించిన 19 అప్పీళ్లను ఇన్ కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకు సిఫార్సు చేశామన్నారు. రూ. 32 లక్షల 10 వేల 440 విలువైన 6 అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. సమావేశంలో కమిటీ మెంబర్ సెక్రటరీ శరత్ చంద్ర, జిల్లా ట్రెజరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ వసుంధర పాల్గొన్నారు.