హైదరాబాద్, వెలుగు: మే 7 తర్వాత లాక్ డౌన్ ఎత్తేయడం, లేదా సడలింపు ఇస్తే తలెత్తే సమస్యలు, పరిష్కార మార్గాలపై పోలీసులు గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రంజాన్ నేపథ్యంలో నెల రోజులపాటు పండ్లు, కూరగాయలు, నిత్యావసరాల మార్కెట్ల వద్ద సోషల్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్లాన్ రూపొందిస్తున్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. కంటైన్మెంట్, క్వారంటైన్ పరిసర ప్రాంతాలపైనా ఫోకస్ పెట్టారు. మార్కెట్లలోని షాప్ ఓనర్లు, చిరువ్యాపారులు మాస్క్లు వాడాలని, శానిటైజేషన్ తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు.
మోండా మార్కెట్లో సీపీ పర్యటన
హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సోమవారం సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో పర్యటించారు. సోషల్ డిస్టెన్సింగ్ పరిశీలించారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు కస్టమర్లు కూడా మాస్క్లు తప్పనిసరిగా వాడేలా చూడాలని మార్కెట్ కమిటీకి సూచించారు.
36 రోజుల లాక్ డౌన్ పై రివ్యూ
36 రోజులుగా నమోదైన ట్రాఫిక్ కేసులతోపాటు లాక్ డౌన్ కేసులను పోలీసు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 3 కిలోమీటర్లు దాటి ట్రావెల్ చేసే వారిని కంట్రోల్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రధానంగా రాబోయే నెల రోజుల్లో పండ్ల కొనుగోలు సమయంలో తలెత్తే సమస్యలపై వివరాలు సేకరిస్తున్నారు. పండ్ల మార్కెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రద్దీ, సోషల్ డిస్టెన్స్ ఏర్పాట్లను సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ద్వారా
పోలీసులు పరిశీలిస్తున్నారు. చాలా ఏరియాల్లో షాప్ ఓనర్లు, కస్టమర్లు మాస్క్లు కూడా వాడడం లేదని గుర్తించారు.