- మనకన్నా ఢిల్లీ, ముంబై, బెంగళూరులే బెటర్
- కేంద్ర జలశక్తి శాఖ ‘డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ రిపోర్ట్’లో వెల్లడి
- 32 ప్రాంతాల్లో తీవ్రంగా సమస్య..15 ప్రాంతాలు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలోనే
- మరో 8 ప్రాంతాలు క్రిటికల్, 9 ప్రాంతాలు సెమీ క్రిటికల్ విభాగంలో..
- ఏటా నగరంలో 6.16 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ తోడేస్తున్న జనం
- రాష్ట్రంలోని 78 ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్యలు.. ఖమ్మం, నల్గొండలో ఎక్కువ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో భూగర్భజలాలను బోర్లు పీల్చేస్తున్నయ్. దీంతో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోతున్నది. ఎక్కువ జనాభా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరులాంటి సిటీలతో పోలిస్తే.. హైదరాబాద్లోనే భూగర్భజలాల విచ్చలవిడి వాడకం ఎక్కువగా ఉన్నది. గ్రౌండ్ వాటర్ తోడివేత ఎక్కువగా జరుగుతున్న మెట్రో సిటీల జాబితాలో హైదరాబాదే టాప్లో ఉంది. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రిలీజ్ చేసిన ‘డైనమిక్ గ్రౌండ్వాటర్ అసెస్మెంట్ రిపోర్ట్’లో పలు ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 620 యూనిట్లలో (ప్రాంతాల్లో) సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధ్యయనాలు చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భూగర్భ జలాల వాడకం చాలా అధికంగా ఉన్నట్టు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ (రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి కలిపి) పరిధిలోని 32 ప్రాంతాల్లో భూగర్భజలాల తోడివేత ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, క్రిటికల్ కేటగిరీల్లో ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. 15 ప్రాంతాల్లో పరిధికి మించి నీటిని తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్పేట, గోల్కొండ, ఆసిఫ్నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట, హిమాయత్నగర్, బాలానగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, హయత్నగర్, శేరిలింగంపల్లి, సరూర్నగర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్నాయి. అదే సమయంలో మారేడుపల్లి, బండ్లగూడ, ముషీరాబాద్, నాంపల్లి, షేక్పేట, సికింద్రాబాద్, కీసర, బాచుపల్లి ప్రాంతాలు (8) క్రిటికల్ కేటగిరీలో
ఉన్నట్టు తేలింది.
తిరుమలగిరి, అల్వాల్, మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మొయినాబాద్, కందుకూరు, కొత్తూరు ప్రాంతాలు (9) సెమీ క్రిటికల్లిస్టులో ఉన్నాయి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల తోడివేత 100 శాతం దాటుతున్నది. క్రిటికల్ కేటగిరీలోని ప్రాంతాల్లో 90 నుంచి వంద శాతం వరకు తోడుతున్నారు. సెమీ క్రిటికల్ కేటగిరీలో 70 నుంచి 90 శాతం వరకు బోర్ల నుంచి నీటిని పీల్చేస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఓవర్ఎక్స్ప్లాయిటెడ్ కేటగిరీలో 23 ప్రాంతాలుంటే.. అందులో 15 సిటీలోనే ఉండడం గమనార్హం. సిటీతోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్, చౌదరిగూడెం, పటాన్చెరు, ఆత్మకూరు ఎం, నారాయణపూర్, రఘునాథపాలెం, మునుగోడులు ఆ కేటగిరీలో ఉన్నాయి. క్రిటికల్ విభాగంలో 19 ప్రాంతాలు, సెమీ క్రిటికల్ కేటగిరీలో 105 ప్రాంతాలున్నాయి.
మన కన్నా ఢిల్లీనే నయం..
హైదరాబాద్ సిటీ జనాభా ఈ మధ్య కాలంలోనే కోటి దాటింది. అదే ఢిల్లీ జనాభా మన సిటీతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. దాదాపు 3.5 కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీ.. భూగర్భజలాల వినియోగం విషయంలో మనకన్నా నయమనిపించేలా ఉంది. ఎక్కువగా భూగర్భజలాలు తోడేస్తున్న జాబితాలో రెండో ప్లేస్లో ఉన్నా.. అక్కడి 21 ప్రాంతాలే క్రిటికల్, ఓవర్ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీల్లో ఉన్నాయి. ఇక, మనంత జనాభే ఉన్న బెంగళూరులో జస్ట్ 16 చోట్లనే భూగర్భ జల వినియోగం ఎక్కువగా ఉంది. ఢిల్లీ, బెంగళూరు, ముంబైలాంటి నగరాలు హైదరాబాద్తో పోలిస్తే వాటి పరిధి, జనాభా ఎక్కువే అయినా కూడా అక్కడ భూగర్భజలాల వాడకం తక్కువగానే ఉంది. దానికి కారణం ఆయా సిటీల్లో భూగర్భజల వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అనుమతులు కూడా తక్కువగా ఇస్తున్నారు. వీలైనంత ఎక్కువగా మున్సిపల్ వాటర్ను సప్లై చేస్తున్నారు. దీంతో భూగర్భజలాలపై అక్కడ ఒత్తిడి తగ్గింది. కానీ, హైదరాబాద్ సిటీ పరిధి ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. ‘క్యూర్’ రీజియన్లోకి మరిన్ని ప్రాంతాలు రావడం, డెవలప్మెంట్యాక్టివిటీలు పెరగడం, స్కైరైజ్లు, ఇండిపెండెంట్ఇండ్ల నిర్మాణాలు పెరిగిపోవడంలాంటి కారణాలతో ఇబ్బడిముబ్బడిగా బోర్లు తవ్వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో కేవలం 2 లక్షల వరకే బోర్లున్నా.. అనధికారికంగా వేస్తున్న బోర్లు 10 లక్షలకుపైగానే ఉంటాయన్నది అధికారులు చెబుతున్న మాట. కనీసం 500 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారు. స్కైరైజ్లు, పెద్దపెద్ద అపార్ట్మెంట్లలో అయితే అది 2వేల అడుగులను దాటిపోతున్నాయి. దీంతో సిటీలో భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగుతున్నది. ఏటా సిటీలో 6.16 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర నీటిని తోడేస్తున్నారు. అందులో సేఫ్ జోన్ అన్నదే లేకుండా పోతున్నది. 2.05 కోట్ల క్యూబిక్ మీటర్ల నీళ్లు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. క్రిటికల్ కేటగిరీలోని ప్రాంతాల్లో దాదాపు 3 కోట్ల క్యూబిక్ మీటర్లు, సెమీ క్రిటికల్ ప్రాంతాల్లో 1.4 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర నీటిన భూగర్భం నుంచి తోడుతున్నారు.
భౌగోళిక పరిస్థితులూ కారణమే..
భౌగోళిక పరిస్థితులూ హైదరాబాద్ సిటీని దారుణమైన పరిస్థితుల్లో నిలబెడుతున్నాయి. దక్కన్ పీఠభూమిపై ఎత్తైన ప్రాంతంలో ఉండడం, ఎక్కువ రాతి పొరలే ఉండడంతో.. వాడుకున్నంతలా భూగర్భజలాలు రీచార్జ్ కావడం లేదు. అంటే ఏటా వెయ్యి మిల్లీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతున్నా.. భూమిలో ఇంకుతున్న జలాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. మొత్తం డ్రైనేజీల ద్వారా వృథా అయిపోతున్నాయి. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరులాంటి నగరాల్లో మాత్రం ఎక్కువ భాగం మెత్తటి నేలలే ఉండడంతో నీళ్లు ఇంకే గుణమూ ఎక్కువగా ఉండి రీచార్జ్ అవుతున్నాయి. మరోవైపు, మన దగ్గర ఇంకుడు గుంతలూ తక్కువే ఉన్నాయి. కేవలం పది శాతం మేరనే ఉన్నాయి. కానీ, ఢిల్లీ, బెంగళూరులాంటి సిటీల్లో వీటి సంఖ్య 30 శాతానికిపైగానే ఉన్నదని రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతో ఆయా సిటీల్లో గ్రౌండ్ వాటర్ రీచార్జ్ ఎక్కువగా ఉంటున్నది. కాబట్టి ఇప్పటికైనా సిటీలో గ్రౌండ్ వాటర్ వినియోగంపై కఠినమైన నిబంధనలు విధించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రౌండ్వాటర్ ఎన్హాన్స్మెంట్కోసం ఇంకుడుగుంతల ఏర్పాట్లపైనా జనాలకు అవగాహన కల్పించాల్సినఅవసరముందని చెబుతున్నారు. వినియోగం ఇలాగే విచ్చలవిడిగా ఉంటే.. సిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో భవిష్యత్లో ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు.
వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్య..
రాష్ట్రంలోని నీళ్ల నాణ్యతపైనా రిపోర్ట్లో కేంద్రం ఆందోళనకరమైనఅంశాలను వెల్లడించింది. ఆర్సినిక్, లవణీయత (సెలైనిటీ) లాంటి సమస్యలేవీ లేనప్పటికీ.. రాష్ట్రం ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సమస్య మాత్రం అలాగే ఉందని రిపోర్ట్ పేర్కొన్నది. పోయిందనుకున్న ఫ్లోరైడ్ మహమ్మారి ఇప్పటికీ రాష్ట్రంలోని భూగర్భజలాల్లో ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. మొత్తంగా స్టడీ చేసిన 620 ప్రాంతాల్లో 78 ప్రాంతాలు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా ఉన్నట్టు తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 12 ప్రాంతాల్లో ఫ్లోరైడ్ మహమ్మారి ఉన్నట్టు రిపోర్ట్ తేల్చింది. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 11 ప్రాంతాలు, వరంగల్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 6 ప్రాంతాల చొప్పున, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 3 చొప్పున ప్రాంతాలు, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, నారాయణపేట, నిర్మల్, యాచారం, జిల్లాల్లో 2 ప్రాంతాల చొప్పున, జనగామ, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు రిపోర్ట్ వెల్లడించింది.
