
- తొలుత బీజేపీ వైపు చూసినట్టు ప్రచారం
- రాజీనామా చేయాలనే షరతుతో వెనక్కి
- మహిపాల్ రెడ్డి చేరికతో కారుదిగిన ఎమ్మెల్యేల సంఖ్య పది
- కాటా, నీలం మధుకు పీసీసీ భరోసా
- భారీ ర్యాలీగా బయల్దేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే
హైదరాబాద్: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పటాన్ చెరు నుంచి భారీ ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఆయన బయల్దేరారు. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే కారుదిగిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరుతుంది. ఇదిలా ఉండగా శనివారం మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ వాట్సాప్ స్టేటస్ తో దాదాపు క్లారిటీ వచ్చింది.
2008వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు, అప్పటి కాంగ్రెస్ నాయకులతో దిగిన ఫొటోలను విక్రమ్ రెడ్డి స్టేటస్గా పెట్టుకున్నారు. దీంతో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారనే వార్తలకు బలం చేకూరింది. ఇప్పటివరకు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
పటాన్ చెరు నేతలు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధుకు పీసీసీ అగ్రనేతలు భరోసా ఇచ్చారు. మహిపాల్ రెడ్డి చేరికతో ఎలాంటి ఇబ్బందులు కలుగవని భరోసా ఇవ్వడంతో చేరికకు మార్గం సుగమమం అయింది.