అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మొత్తం 19 జిల్లాల్లో పోలింగ్ జరుగుతుందని, 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) భారతి ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 దాకా పోలింగ్ కొనసాగుతుందన్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాల్లో బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 40 స్థానాలను దక్కించుకుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్తో పాటు మొత్తం 36 పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. బీజేపీ, కాంగ్రెస్ 89స్థానాల్లో పోటీ చేస్తుంటే, ఆప్ 88 చోట్ల బరిలో నిల్చుంది. ఇక బీఎస్పీ 57, భారతీయ ట్రైబల్ పార్టీ 14, సీపీఎం నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నది. 339 మంది ఇండిపెండెంట్లుగా ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 70 మంది మహిళలున్నారు. వీరిలో బీజేపీ నుంచి 9 మంది, కాంగ్రెస్ నుంచి ఆరుగురు, ఆప్ నుంచి
ఐదుగురు పోటీలో ఉన్నారు.
89 మోడల్ పోలింగ్ స్టేషన్లు
గుజరాత్లో 4,91,35,400 మంది ఓటర్లు ఉండగా, ఫస్ట్ఫేజ్లో 2,39,76,670 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 18–19 ఏండ్ల వయస్సు వారు 5.74 లక్షలు, 99ఏండ్లు పైబడిన వారు 4,945 మంది ఉన్నారు. మొత్తం 14,382 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 3,311 కేంద్రాలు అర్బన్లో ఉండగా, 11,071 కేంద్రాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి. 89 ‘మోడల్ పోలింగ్ స్టేషన్’లను ఏర్పాటు చేశారు. వీటిలో ఎక్కువ స్టేషన్లు హ్యాండీక్యాప్లతో నిర్వహించబడుతాయి. 89 ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్లను 611 మహిళలు నిర్వహిస్తారు. 18 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను యూత్ చూసుకుంటున్నది. మొత్తంగా 2,20,288 మంది ఆఫీసర్లు ఎన్నికల విధుల్లో ఉంటారు. ఫస్ట్ఫేజ్లో 27,978 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 78,985 మంది పోలింగ్ ఆఫీసర్లు డ్యూటీ చేస్తారు.
సౌరాష్ట్ర–కచ్ రీజియన్ కీలకం
ఆఫ్ సీఎం కేండిడేట్ ఇసుదాన్ గాధ్వి (ఖంబాలియా), ఆప్ స్టేట్ ప్రెసిడెంట్ గోపాల్ (కటర్గాం), క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా(జామ్నగర్ నార్త్)తో పాటు పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్న స్థానాలకు గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. సౌరాష్ట్ర–కచ్ రీజియన్లోని 54 స్థానాలు కాంగ్రెస్కు ఎంతో కీలకం. 2017 ఎన్నికల్లో ఈ రీజియన్లో కాంగ్రెస్ 30 స్థానాల్లో, బీజేపీ 23 స్థానాల్లో గెలిచింది. సూరత్ సిటీలోని 12 స్థానాలపై బీజేపీ, కాంగ్రెస్ గురిపెట్టాయి. సూరత్లో 7 స్థానాల్లో గెలుస్తామని ఆప్ ప్రకటించింది.
రూ.290 కోట్ల లిక్కర్, డ్రగ్స్ సీజ్
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వివిధ చోట్ల జరిగిన తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రూ.290 కోట్ల విలువైన డ్రగ్స్, లిక్కర్, క్యాష్ను సీజ్ చేసినట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. 2017 ఎన్నికల టైంలో పట్టుబడిన వాటితో పోలిస్తే 10 రెట్లు అధికమని ప్రకటించింది. 2017లో నవంబర్ 29దాకా సీజ్ చేసిన వాటి విలువ రూ.27.21 కోట్లు ఉంటే.. తాజా ఎన్నికల్లో రూ.290.24 కోట్లు అని తెలిపింది. గుజరాత్ ఏటీఎస్ చేపట్టిన ఆపరేషన్లో రూ.61.96 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని వివరించింది. రూ.14కోట్లు విలువ చేసే 4లక్షల లీటర్ల లిక్కర్ను సీజ్ చేసిందని చెప్పింది. వడోదర (రూరల్), వడోదర సిటీలో భారీగా డ్రగ్స్ నిల్వలు గుర్తించినట్టు ఈసీ ప్రకటించింది. మెఫెడ్రోన్ డ్రగ్ తయారు చేసే రెండు యూనిట్లను గుర్తించి.. రూ.478 కోట్ల విలువైన 143 కిలో సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నదియాడ్, వడోదరకు చెందిన ఐదుగురిని అదుపులో తీసుకొని ఏటీఎస్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారని వివరించింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఈసీ చెప్పింది.