
పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. ఆయన జైలు శిక్షపై మధ్యంతర స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అలాగే జూన్ నాలుగు తర్వాతే ఆయన పిటిషన్పై ఉత్తర్వులు ఇస్తామని చెప్పింది. దీంతో పరువునష్టం కేసులో హైకోర్టు ఆర్డర్ వచ్చే వరకు తన శిక్షపై స్టే విధింపు కోసం రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
‘దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో..?’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ... సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేయడంతో కేసు విచారణ ప్రారంభమైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రాహుల్పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం... పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారని గుర్తు చేసింది.
అనంతరం రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు విని 20న తీర్పు వెలువరించింది. దీనిపై రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.