
- ఇంట్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు పెట్టుకుంటే, అందరి ప్రాణాలు దక్కేవంటున్న ఆఫీసర్లు
- కోట్లు పెట్టి ఇండ్లు కడ్తున్నా.. 10 వేల ఫైర్ సేఫ్టీ పరికరాలు పెట్టట్లే
- పొగ వచ్చినా, వేడి పుట్టినా అలారంతో అలర్ట్ చేస్తయ్
- నాన్ హైరైజ్ బిల్డింగుల్లోనూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరి చేయాలని అగ్నిమాపక శాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: కోట్లు పెట్టి ఇండ్లు కడ్తున్నా, రూ.10 వేలు పెట్టి ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చుకునేందుకు జనం వెనుకాడుతున్నారని ఫైర్ ఆఫీసర్లు అంటున్నారు. ఇల్లు పెద్దదైనా, చిన్నదైనా ఫైర్సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకుంటే అగ్నిప్రమాద సమయాల్లో పొగ వచ్చినప్పుడే అలారం మోగి అలర్ట్ చేస్తాయని చెబుతున్నారు. ఇలాంటి పరికరాలు లేకపోవడం వల్లే హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటున్నారు. గుల్జార్హౌస్ఘటన తర్వాత అక్కడికెళ్లిన ఫైర్ ఆఫీసర్లు.. బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా? అని స్థానికులను ప్రశ్నించారు.
అయితే ఆ బిల్డింగ్కు ఫైర్ సర్వీస్రూల్స్ వర్తించవని వాళ్లు ఎదురు సమాధానం చెప్పడంతో ఆఫీసర్లు షాక్ అయ్యారు. రూల్స్తో సంబంధం లేకుండా మన రక్షణ కోసం ఇంట్లో ఫైర్సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్న కనీస అవగాహన వాళ్లకు లేదని ఆఫీసర్లు అర్థం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో మంటలు ఆర్పేందుకు నీళ్లు తప్ప ఇతర పరికరాలు లేని కారణంగా తీవ్రత పెరిగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఫోరెన్సిక్, ఫైర్ ఇంజనీర్ల పరిశీలనలో వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ సమగ్ర నివేదిక అందించనుంది.
ఫైర్ సేఫ్టీ పరికరాలతో మేలు..
మూడు బెడ్రూమ్స్, ఒక కిచెన్ ఉన్న ఇంట్లో కేవలం రూ.10 వేల ఖర్చుతో స్మోక్ డిటెక్టర్లు, హీట్ డిటెక్టర్, మంటలను ఆర్పేందుకు కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో స్మోక్ డిటెక్టర్ మంచి రిజల్ట్ఇస్తుంది. ఇంట్లో చిన్నపాటి పొగ వ్యాపించినా అలారం మోగి అలర్ట్ చేస్తుంది. ఇక కిచెన్లో టెంపరేచ్ పెరిగిన సమయాల్లో హీట్ డిటెక్టర్ అలారం ఇస్తుంది. నిర్ణీత వేడికంటే ఎక్కువ వేడి వస్తే వెంటనే గుర్తించి అలర్ట్చేస్తుంది. దీంతో మనం ప్రమాదంలో ఉన్నామని గ్రహించవచ్చు. ఈ క్రమంలో Co2 సిలిండర్ను ఇంట్లో రక్షణ కవచంగా వినియోగించవచ్చు. నీటి కంటే కార్బన్డై ఆక్సైడ్ సిలిండర్ లేదంటే ఫోమ్ ద్వారా మంటలు అత్యంత సులువుగా అదుపులోకి తీసుకురావచ్చు.
ఇప్పటికైనా మార్పు రావాలి..
గుల్జార్ హౌస్ ఘటనతో ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలని ఫైర్ఆఫీసర్లు అంటున్నారు. ఏటా జరుగుతున్న అగ్నిప్రమాదాల్లో 40 నుంచి 50 శాతం ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ వల్లేనని చెబుతున్నారు. నాసిరకం వైరింగ్, హైవోల్టేజ్తో నిరంతరం కరెంట్ సప్లయ్ ఉండడానికే జనం ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణ, భద్రతపై మాత్రం దృష్టి సారించడం లేదంటున్నారు. దీంతో పాటు గ్యాస్సిలిండర్ భద్రతకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెప్తున్నారు. ఇవే కాకుండా విద్యుత్ లైన్ సిస్టమ్ అర్థం కావడానికి ప్యానల్ బోర్డు వద్ద స్కెచ్, ట్రిప్ సిస్టమ్తో పనిచేసే ఫ్యూజుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
నాన్ హైరైజ్ బిల్డింగుల్లోనే 99 శాతం ప్రమాదాలు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 3,500 హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇటీవల మరో 7,000 బిల్డింగులకు ఫైర్ సర్వీస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు మంజూరు చేసింది. అయితే ప్రతిఏటా సంభవిస్తున్న అగ్ని ప్రమాదాల్లో 99 శాతం 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న నాన్ హైరైజ్ బిల్డింగ్స్లోనే జరుగుతున్నాయి. జనావాసాల మధ్య ఉన్న షాపింగ్ కాంప్లెక్సులు, కంపెనీల్లో ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరుగుతోంది.
నాసిరకం కేబుల్స్, అధిక ఉష్ణోగ్రతలతో తలెత్తే షార్ట్ సర్క్యూట్తో భారీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కంపెనీల్లోని బాయిలర్ల పేలుళ్ల వల్ల పారిశ్రామిక వాడల్లో ఎక్కువ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఇలా ఏటా సుమారు రూ.250 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరగడంతో పాటు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తించింది.
నాన్ హైరైజ్ బిల్డింగులకు వర్తించని రూల్స్
15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న నిర్మాణాలకు ఫైర్ సర్వీస్ రూల్స్ వర్తించవు. ఇలాంటి బిల్డింగ్స్కి ప్రస్తుత చట్టం ప్రకారం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. దీంతో నాన్ హైరైజ్ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఈ కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించిన సమయాల్లో ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతున్నది.
ఇలాంటి పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర అగ్నిమాపక శాఖ..హైరైజ్ బిల్డింగ్స్తో పాటు నాన్ హైరైజ్ బిల్డింగ్లను కూడా చట్టపరిధిలోకి తీసుకురానుంది. కమర్షియల్ కాంప్లెక్స్లు సహా ఇతర నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతం స్క్వైర్ మీటర్కు ఒక్క రూపాయి మాత్రమే ఫైర్ సర్వీస్ ట్యాక్స్ అమలులో ఉంది. గ్లోబలైజేషన్ తరహాలో ఫైర్ సేఫ్టీ అవసరాలకు అనుగుణంగా ట్యాక్స్ను కూడా పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది.
చట్టంలో మార్పులకు కసరత్తు..
25 ఏండ్ల కిందటి ఫైర్ సర్వీస్ యాక్ట్లో కీలక మార్పులు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న బిల్డింగ్స్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు బిగించుకునేలా నిబంధనలు కఠినతరం చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఫైర్ సర్వీస్ యాక్ట్–1999 చట్టం అమలవుతున్నది. దీని ప్రకారం 15,18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు నిర్మాణాలకు మాత్రమే ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు, ఎన్వోసీలు తప్పనిసరి.
ఇలాంటి వాటిలో అగ్ని ప్రమాదం జరిగితే గుర్తించేందుకు పటిష్టమైన పరికరాలు ఉంటాయి. మంటలను ఆర్పేందుకు అవసరమైన వాటర్ ట్యాంకర్, లోపలి భాగంలోకి పైప్లైన్స్ ఉంటాయి. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వచ్చేలోగా మంటలను అదుపు చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ఫైర్ అధికారులు చెకింగ్, మాక్ డ్రిల్స్తో ప్రమాదాల నివారణను అవసరమైన అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు.
చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం
కోట్లు పెట్టి నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు, ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్లో కూడా కనీస ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చడం లేదు. దీంతో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. ఇంటి నిర్మాణంలో నాణ్యత లేని వైరింగ్ వాడడం కూడా షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతోంది. వైరింగ్ను కనీసం 15 ఏండ్లకు ఒకసారి మార్చుతూ ఉండాలని, ప్యానల్ బోర్డు పక్కనే వైరింగ్కు సంబంధించిన స్కెచ్, ఆటోమెటిక్ ట్రిప్ స్విచ్లను ఏర్పాటు చేసుకోవాలని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు.
10 కేవీఏ కన్నా ఎక్కువ లోడ్ ఉన్న అన్ని కనెక్షన్లకు అవసరమైనంత మేరకు ఎర్తింగ్ ఏర్పాటు చేయాలని, చిన్న ఖర్చుకు భయపడి నిబంధనలు పాటించకపోవడంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగి ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.