ఆఫీసులో కాల్పుల మోత.. నలుగురు మృతి

ఆఫీసులో కాల్పుల మోత.. నలుగురు మృతి

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు.  బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో ఓ చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. దక్షిణ కాలిఫోర్నియా, ఆరెంజ్‌ సిటీలోని ఓ ఆఫీస్ భవనంలోని రెండవ అంతస్తులో ఈ షూటింగ్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారి జెన్నిఫర్‌ అమాత్ తెలిపారు. దుండగుడి కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళ గాయపడింది. గాయపడిన మహిళతోపాటు తీవ్ర గాయాలతో ఉన్న దుండగుడిని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. దుండగుడికి గాయం ఎలా అయిందో ఇంకా తేలలేదు. పోలీసులకు భయపడి దుండగుడు తనకు తానే కాల్చుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.