
హైదరాబాద్, వెలుగు: నీట్ యుజీ ఫలితాల్లో గురుకుల స్టూడెంట్స్ సత్తా చాటారు. ఈ ఏడాది ఎస్టీ గురుకులాల నుంచి మొత్తం 538 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాయగా..306 మంది అర్హత సాధించినట్లు ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 8 మంది స్టూడెంట్లకు 2 వేల లోపు ర్యాంకులు వచ్చాయన్నారు. 62 మంది 7వేల లోపు ర్యాంకులు సొంతం చేసుకున్నారని తెలిపారు. శ్రీశాంత్ 1,426, కళ్యాణి 1,450, యశస్విని 1,549, స్రవంతి 1,635, హరిలాల్ 1,640, పూజ 1,734, మన్ సింగ్ 1,909, మోహన్ 1,930 ర్యాంకులు సాధించరని వివరించారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, అందుకు కృషి చేసిన సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే.. ఎస్సీ గురుకులాల నుంచి మొత్తం 20 మంది నీట్ ర్యాంకులు సాధించినట్లు సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడించారు. స్పందన, నవ్య 98.58, మహదేవ్ 98.42 పర్సంటైల్ సాధించినట్లు వివరించారు. ర్యాంకులు సాధించిన వారికి సీఎం, డిప్యూటీ సీఎం, ఎస్సీ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గ్రీటింగ్స్ తెలియజేశారు.