రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల సెల్ ఫోన్లను సర్కారు హ్యాక్ చేయిస్తోందంటూ ఇటీవల ఆరోపణలు చేసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తాజాగా దీనికి సంబంధించి మరో ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన మరో ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ వాడే ఆపిల్ ఐఫోన్ ను హ్యాక్ చేస్తామంటూ రెండుసార్లు బెదిరింపు నోటిఫికేషన్ వచ్చాయన్నారు, ఈ విషయాన్ని తనతో అతను పంచుకున్నట్లుగా ప్రవీణ్ కుమార్ ట్వీట్ లో పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుల ఫోన్లను హ్యాక్ చేయడం క్షమించరాని నేరమన్నారు. స్టేట్ హ్యాకర్లను శిక్షించండి అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతల సెల్ ఫోన్లను సర్కారు హ్యాక్ చేస్తుందని ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సామాన్యుల నుంచి లీడర్ల దాకా ఎవరి ఫోన్లకూ సేఫ్టీ లేదన్నారు. ముఖ్యంగా అపోజిషన్ లీడర్లు ధైర్యంగా సెల్ఫోన్ వాడే పరిస్థితి లేదన్నారు. తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని, స్వయంగా ఆపిల్ నుంచి మెయిల్ వచ్చిందని, దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇది పిరికిపంద చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.