నేవీ కూడా యుద్ధం చేసి ఉంటే.. పాకిస్తాన్​ నాలుగు ముక్కలయ్యేది.. కేంద్రమంత్రి రాజ్​నాథ్

నేవీ కూడా యుద్ధం చేసి ఉంటే.. పాకిస్తాన్​ నాలుగు ముక్కలయ్యేది.. కేంద్రమంత్రి రాజ్​నాథ్
  • ఆపరేషన్ సిందూర్​లో మన నేవీ సైలెంట్ సర్వీస్ అద్భుతం: రాజ్​నాథ్ 
  • మన సన్నద్ధతను చూసి పాక్ నేవీ షిప్పులు తీరానికే పరిమితమైనయ్ 
  • ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి రక్షణ మంత్రి స్పీచ్

పణజి(గోవా): ఆపరేషన్ సిందూర్​లో ఇండియన్ నేవీ అందించిన సైలెంట్ సర్వీస్ అద్భుతమని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ కొనియాడారు. మన నేవీ యుద్ధ సన్నద్ధతను, శక్తి సామర్థ్యాలను చూసి పాకిస్తాన్ నేవీ తన షిప్పులను తీరం నుంచి ముందుకు కదిలించేందుకే వణికిపోయిందన్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇండియన్ ఆర్మీకి తోడుగా నేవీ కూడా యుద్ధానికి దిగినట్లైతే ఈ సారి పాకిస్తాన్ నాలుగు ముక్కలు అయి ఉండేదన్నారు. శుక్రవారం గోవా సమీపంలో అరేబియా సముద్రంలో మోహరించిన తొలి స్వదేశీ యుద్ధవిమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ను రక్షణ మంత్రి సందర్శించారు. 

నేవీ యుద్ధ సన్నద్ధతపై రివ్యూ చేసిన అనంతరం యుద్ధనౌకపై నేవీ వారియర్స్​ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘1971 నాటి యుద్ధంలో నేవీ రంగంలోకి దిగినందుకే పాకిస్తాన్ రెండు ముక్కలైంది. ఈసారి కూడా నేవీ దాడులు మొదలుపెట్టి ఉంటే.. ఆ దేశం 4 ముక్కలు అయిపోయి ఉండేది” అని రాజ్​నాథ్ సింగ్ అన్నారు. 

ఆపరేషన్ సిందూర్ లో ఇండియన్ నేవీ సైలెంట్​గానే అత్యంత కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ‘‘విక్రాంత్ అంటే..  అంతులేని ధైర్యం, పరాజయం ఎరుగని శక్తి అని అర్థం. నేడు మీవంటి వీర సైనికుల ముందు నిలబడి మాట్లాడుతుంటే.. మీ కళ్లలోనే ఆ పరాక్రమం కనిపిస్తోంది. భారత శక్తి మీ కళ్లలో ప్రతిబింబిస్తోంది” అని రాజ్​నాథ్​ కొనియాడారు.

పాక్ ‘టెర్రర్ గేమ్స్’ ఇక సాగవ్.. 

ఆది నుంచీ పాకిస్తాన్ టెర్రర్​ గేమ్స్ ఆడుతోందని, ఇప్పుడు దాని ఆటలకు కాలం చెల్లిపోయిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్ అన్నారు. పాక్ మళ్లీ భారత్ పైకి ఉగ్రమూకలను ఎగదోస్తే గనక దీటుగా సమాధానం చెప్తామన్నారు. ఇకపై పాక్​తో చర్చలంటూ జరిగితే అవి టెర్రరిజం, పీవోకే అంశాలపైనే ఉంటాయన్నారు. చర్చల పట్ల ఆ దేశం నిజంగా సీరియస్​గా ఉంటే ముందు టెర్రరిస్టులను అప్పగించాలని డిమాండ్ చేశారు. 

కాగా, తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ 2022లో నేవీలో చేరింది. 45 వేల టన్నుల బరువైన ఈ యుద్ధ నౌకపై మిగ్ 29కే ఫైటర్ జెట్​లు, హెలికాప్టర్లతో కూడిన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్​ను నేవీ మోహరించింది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్​లను సమకూర్చుకుని, ఈ షిప్పుపై మోహరించేందుకు నేవీ రంగం సిద్ధం చేస్తోంది.