- సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో హ్యాండ్బాల్ అకాడమీ
- తొందర్లోనే ఏర్పాటు చేస్తాం..
- నగరంలో మరిన్ని టోర్నీలు నిర్వహిస్తాం
- నేషనల్ హ్యాండ్బాల్ ప్రెసిడెంట్ జగన్ మోహన్
హైదరాబాద్, వెలుగు: క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ తరహాలో దేశంలో హ్యాండ్బాల్కు ఆదరణ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు ఎ. జగన్ మోహన్ రావు చెప్పారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో హ్యాండ్బాల్ అకాడమీని తొందర్లోనే ఏర్పాటు చేస్తామ న్నారు. దీనికి తోడు తోడు దేశంలోని ప్రధాన నగర్లాల్లో ఫీడర్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిభావంతులను వెలికి తీస్తామని తెలిపారు. హైదరాబాద్ వేదికగా గత వారం ఆసియా మెన్స్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత తమ ఫ్యూచర్ ప్లాన్స్ను జగన్ మీడియాతో పంచుకున్నారు. ‘హ్యాండ్బాల్ ఇండోర్ గేమ్. కానీ, మన దేశంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో బయట ఆడుతున్నారు.
నేను హ్యాండ్బాల్ ఫెడరేషన్ పగ్గాలు చేపట్టిన తర్వాత దీన్ని ఇండోర్కు పరిమితం చేసేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ అకాడమీకి ప్లాన్ చేశాం. ఇందులో హాస్పిటల్, జిమ్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, రిహాబిలేషన్ సెంటర్లు ఉంటాయి. దీంతో పాటు దేశంలో కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. వచ్చే నెలలో అంతర్జాతీయ హ్యాండ్బాల్ నిపుణలతో ఆన్లైన్, ఆఫ్లైన్లో ట్రైనింగ్ ప్రోగామ్స్ను నిర్వహిస్తాం. తొలి దశలో పట్టణ స్థాయిలోనైనా హ్యాండ్బాల్ను బ్యాడ్మింటన్ తరహాలో పూర్తి ఇండోర్ గేమ్గా తీర్చిదిద్దుతాం. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే దేశంలో హ్యాండ్బాల్కు ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. ఇప్పటికే ఐపీఎల్, కబడ్డీ లీగ్ మాదిరిగా... ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్కు రూపకల్పన చేశాం. ఫ్యూచర్లో దీన్ని రాష్ట్ర స్థాయికి కూడా విస్తరించాలని భావిస్తున్నాం. దాంతో, నాణ్యమైన ప్లేయర్లు పెరిగితే.. సహజంగానే ఆటకు గుర్తింపు కూడా వస్తుంది’ జగన్ చెప్పుకొచ్చారు.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో హ్యాండ్బాల్ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని జగన్ చెప్పారు. హైదరాబాద్కు మరిన్ని పెద్ద టోర్నీలను తీసుకొస్తామని, మున్ముందు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్లో కూడా జాతీయ స్థాయి టోర్నీలు నిర్వహించాలన్నది తమ ఆలోచన అన్నారు. రాష్ట్రంలో హ్యాండ్బాల్తో పాటు ఇతర క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.