
రాజకీయ నాయకులకు, అధికారులకు శాలువాలు కప్పే సంస్కృతి పెరిగింది. పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు కూడా ఇందులో ఉన్నా, శాలువాలు చాలా వేగంగా విస్తరించాయి. ఇదివరకు సాహిత్య సమావేశాలలో ప్రముఖులను సన్మానించే కార్యక్రమాలలో మాత్రమే ఉపయోగించే ఈ పద్ధతి ఇప్పుడు అన్ని రకాల సమావేశాలలో శాలువాలుకప్పుతున్నారు. వేదిక మీద కూర్చోబెట్టిన అందరికీ కప్పి తమకు అంతరాలు లేవు అని చాటుతున్నారు. ఇది అక్కడితో ఆగలేదు. రోడ్లమీద, కార్ల దగ్గర ఎక్కడపడితే అక్కడ కప్పుతున్నారు. శాలువాలు
కప్పడం, ఫొటోలు తీసుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. ఇదివరకు రాజకీయ పార్టీలలో పెద్దలకు కండువాలు కప్పేవారు. ఇప్పుడు కండువాలు మెడలో వేసినా, వేయకపోయినా శాలువాలు మాత్రం కప్పుతున్నారు. కలిసిన ప్రతి సందర్భంలో శాలువాలు కప్పుతున్నారు. అంతకు ముందు రోజే కలిసినా, తెలిసిన వ్యక్తి అయినా శాలువాలు కప్పడం ఒక రివాజుగా మారింది. అయితే సన్మానాలు, సత్కారాలకు శాలువా అనివార్యమైంది. గౌరవ వ్యక్తులను కలిసినపుడు ఒక శాలువా కప్పడం సహజం. ఆనక శాలువా తెచ్చిన ప్లాస్టిక్ కవర్ అక్కడే పారవేయడం. శాలువాలు కృత్రిమ నూలుతో చేసినవే కాబట్టి మొత్తంగా ప్లాస్టిక్ కవరు, ప్లాస్టిక్ శాలువా రాజకీయ, అధికార సమావేశాలలో, బయటా, లోపటా నిత్యకృత్యం అయ్యాయి.
5లక్షల మంది ప్రముఖులు
భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది ప్రముఖులు ఉన్నారని ఒక లెక్క. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, వారి నుంచి మంత్రులు ఉంటున్నారు. హైదరాబాద్ నగరంలో కనీసం 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ఇంకా ఎక్కువగా ఉన్నారు. ఇక అధికారుల సంఖ్య కూడా జోడిస్తే రోజూ కప్పుతున్న శాలువాల సంఖ్య కనీసం 500 నుంచి 1000 మధ్య ఉండవచ్చు. వీరి పర్యటనలలో, నిర్వహించే సమావేశాలలో శాలువాలు కప్పేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. ఖచ్చితమైన లెక్క దొరికే అవకాశం లేదు గాని ఒక అంచనా ప్రకారం తెలంగాణలో రోజూ శాలువాల మీద అవుతున్న ఖర్చు దాదాపు రూ.10 నుంచి 20 వేలు ఉండవచ్చు. శాలువాకు రూ.200 సగటు ధర చొప్పున సంవత్సరానికి ఈ ఖర్చు తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఉండవచ్చు. బహుశా రూ.30 నుంచి 60 లక్షల వరకు శాలువాల మీద ఖర్చు అవుతున్నది. ఇంకా ఎక్కువే అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
పోచంపల్లి శాలువాలతో సత్కారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వం పెట్టుబడిదారులను, రాష్ట్ర అతిథులను పోచంపల్లి శాలువాలతో సత్కరిస్తున్నారు. సాధారణంగా ఇది కేవలం పరిశ్రమ శాఖ చేస్తున్నది. వీళ్లు కప్పే శాలువాలు డిజైన్ పరంగా చూస్తే చేనేత వస్త్రంగా అనిపిస్తున్నా అది పవర్లూమ్ ఉత్పత్తి కూడా కావచ్చు. పరిశ్రమల శాఖ కప్పుతున్న శాలువాలు చేనేత కూడా కాకపోవచ్చు. డిజైన్ మాత్రమే పోచంపల్లిది వాడుతూ, శాలువాలు పవర్లూమ్ మీద నేసేవి వాడుతున్నట్లుగా అనుమానం కలుగుతున్నది. కాకపోతే ఇవి చాలా పొడవు, అత్యంత ఖరీదైనవిగా కనిపిస్తాయి.
చేనేతపై దృష్టి పెట్టాలి
చేనేత వస్త్రాలను ‘టూరిజం’ కోసం ఇంకా ఇతర ఆకర్షణీయ లక్ష్యాల కోసం వాడడం తప్పితే, చేనేత పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి లోతైన చిత్తశుద్ధి లేదు అని అర్థం అవుతోంది. ప్రజలు నిత్యం వాడే శాలువాలు చాలా తక్కువ ఖరీదు, నాసిరకం ఫైబర్ ఉపయోగించి యంత్రాలతో నేసినవి. తెలంగాణ ప్రభుత్వానికి, శాలువాలు కప్పేవారికి చిత్తశుద్ధి ఉంటే చేనేత వస్త్రాలను, శాలువాలను కప్పడం అలవాటు చేసుకోవాలి. వాటిని కప్పితే ఆ వ్యక్తికి తగిన గౌరవం ఇచ్చినట్లు. ఏదో మార్కెట్లో దొరికింది కొనుక్కువచ్చి కప్పడం సహజం. తెలంగాణలో శాలువాల మీద పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చు చేనేతరంగానికి పెట్టుబడిగా మార్చితే వచ్చే ఫలితాలు బహుళార్ధకం. ఈ దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
అంతర్జాతీయ లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్ల వరకు భారతదేశానికి చెందిన చేతితో నేసిన, ఎంబ్రాయిడరీ శాలువాలు ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఒక ఉపయోగకర వస్త్రం నుంచి..ఫ్యాషన్ వస్తువుగా మారేవరకు, సంప్రదాయ భారతీయ శాలువా రాజకీయ మార్గాల్లో ప్రాచుర్యంలోకి వస్తున్నది. డిజైనర్లు ఈ శాలువాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. కొత్త డిజైన్లు, పద్ధతులలో ప్రయత్నిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శాలువా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలలో ఇది ఇప్పటికీ కీలకపాత్ర పోషిస్తున్నది. నేత, ఎంబ్రాయిడరీ, ప్రాసెసింగ్ లేదా మార్కెటింగ్ అయినా, లక్షలాది మంది పురుషులు, మహిళలకు ఉపాధిని అందిస్తోంది శాలువాల పరిశ్రమ. భారతదేశంలో శాలువా తయారీ ఒక విలక్షణమైన ఉపాధి. శాలువా వస్త్రం అనేక దశలలో తయారవుతుంది. భారతీయ సంప్రదాయ శాలువా మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతున్నది. 2023లో సిల్క్ శాలువ, స్కార్ఫ్ మార్కెట్ విలువ దాదాపు రూ.1200 కోట్లు అని అంచనా. ఇది ఇంకా పెరుగుతున్నది.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్