
- వెంటనే ఫండ్స్ విడుదల చేయాలి.. సిబ్బందికి జీతాలు చెల్లించాలి
- మంత్రి సీతక్కకు హరీశ్ రావు లేఖ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పారిశుధ్యం పడకేసిందని, వీధి దీపాలను సరిగా నిర్వహించకపోవడంతో పల్లెల్లో అంధకారం అలముకుంటున్నదని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మంత్రి సీతక్కకు లేఖ రాశారు. ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ ట్యాక్స్కట్టక అధికారులకు తాళాలు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి నిర్వహణ కొనసాగించారన్నారు.
దీంతో పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం భారీగా పెరిగి మానసిక ఆందోళనకు గురవుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధుల విడుదల మరింత కష్టతరం అవుతుందని బాధపడుతున్నారని, మాజీ సర్పంచులు కూడా చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలన్నారు. సీజనల్ వ్యాధులు తీవ్రమవకుండా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుధ్యం పెంచాలన్నారు. పారిశుధ్య కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.