3న నర్సాపూర్ కేసీఆర్ సభకు తరలిరండి : హరీష్ రావు

3న నర్సాపూర్ కేసీఆర్ సభకు తరలిరండి : హరీష్ రావు
  • TRSకు ఓటేస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించొచ్చు
  • నిజాంపేటలో టీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు

మెదక్ లోక్ సభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని అన్నారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు. మెదక్ జిల్లా నిజాంపేట్ లో టీఆర్ఎస్ మండల  స్థాయి విస్తృత సమావేశంలో హరీష్ రావు, కొత్తప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే  పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

“రోజుకొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తెలంగాణ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ చిన్న చూపు చూసింది. రైతు బంధు పథకం తెలంగాణలో చూసి బీజేపీ ప్రభుత్వం కాపీ కొట్టి కేంద్రంలో ప్రవేశపెట్టింది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నాయకులైతేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కేంద్రం నిధులను ముక్కుపిండి రాబట్టవచ్చు. 3వ తేదీన నర్సాపూర్ లో CM KCR సభ ఉంది. అందరూ హాజరై విజయవంతం చేయాలి” అని అన్నారు హరీష్ రావు.