
హైదరాబాద్, వెలుగు: మాససిక ఒత్తిడిని జయించడానికి ఉత్సాహాన్ని ఇచ్చే మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో 11వ గ్రాండ్ నర్సరీ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఇంట్లోనే టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెన్, కిచెన్ గార్డెన్లలో కూరగాయలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇండ్లలో మొక్కలు పెంచడంతో చక్కటి వాతావరణంతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అన్నారు. 100కు పైగా స్టాళ్లలో రకరాల మొక్కలు, హార్టీకల్చర్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పూలమొక్కలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ను ప్రోత్సహిస్తున్నామని మంత్రి వివరించారు. హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి వేదిక అని షో ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 28దాకా రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు మేళాను సందర్శించవచ్చని చెప్పారు.