
- 19 నెలల పాలనలో రైతన్న అరిగోస: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 12వేలకు పరిమితం చేయడం మోసం చేయడమేనని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. గత వావాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబురాలు జరపడం రైతులను మోసగించడమేనన్నారు.
రైతులకు ఏం చేశావని సంబురాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి? రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? ఎందుకు సంబురాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి?” అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నారని అన్నారు.