
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల బాగోతం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాటలతో బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. చంద్రబాబుతో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే చాలన్న పల్లవిని ఎత్తుకున్నారని శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కేబినెట్ మీటింగ్ ఏర్పాటు, చంద్రబాబుతో చర్చల ప్రతిపాదన ముందే కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమన్నారు. గోదావరిలో 2,918 టీఎంసీలు కావాలని కేసీఆర్ అడిగితే.. రేవంత్ వెయ్యి టీఎంసీలకే పరిమితం చేస్తున్నారన్నారు.
కృష్ణా జలాల్లో 763 టీఎంసీల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడితే.. రేవంత్ 500 టీఎంసీలతో సరిపెట్టాలనుకోవడం తెలంగాణను నిండా ముంచడమేనన్నారు. అపెక్స్ కౌన్సిల్కు డిమాండ్ చేయకపోవడం, చంద్రబాబుతో చర్చలు చేస్తామనడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. మరోవైపు, యాసంగిలో సన్న వడ్ల కొనుగోళ్లు పూర్తయినా ప్రభుత్వం ఇంకా బోనస్ విడుదల చేయకపోవడం దుర్మార్గమని హరీశ్ రావు విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించినా.. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.