కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు: హరీష్ రావు

కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరు: హరీష్ రావు

కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు.. కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు.  తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే అని చెప్పారు. జనవరి 12వ తేదీ శుక్రవారం 
గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే.. మన నీళ్లు మనకు వచ్చినయి.. మన గ్రామలు అభివృద్ధి చెందాయన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే.. ఆసరా పెన్షన్, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, దివ్యాంగుల పెన్షన్, కేసీఆర్ కిట్ ఇలా  అన్నీ వచ్చాయని తెలిపారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామని అన్నారు. 

మనోహరాబాద్‌ను మండలం చేసింది కేసీఆర్.. కాని, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందని అంటోందన్నారు.  కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటున్నదని... కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్.. రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారని... మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు హరీష్ రావు.  కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం.. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? అని అన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం.. బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత... తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం... వారి పక్షాన పోరాడతాం... బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లు అని అన్నారు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరని..ఆరోపణలు మాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతామని హరీష్ రావు తెలిపారు.