న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, శిరోమణి అకాళీదల్ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లో కిసాన్ సంఘం మూడ్రోజుల రైల్ రోకోకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బిల్లులపై హర్సిమ్రత్ కౌర్ యూటర్న్ తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ మూడు బిల్లులు రైతులకు వ్యతిరేకమని తాను చెప్పలేదని సిమ్రత్ పేర్కొన్నారు. ‘అవి రైతు వ్యతిరేక బిల్లులని నేను చెప్పలేదు. రైతులే ఆ బిల్లులను యాంటీ ఫార్మర్ బిల్స్ అంటున్నారు. రైతుల బాగు కోసమే సదరు బిల్స్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. తమ మేలు కోసమే ఈ బిల్లులను తీసుకొచ్చారని రైతులు నమ్మాలి’ అని ఓ ఇంటర్వ్యూలో సిమ్రత్ చెప్పారు.
I have resigned from Union Cabinet in protest against anti-farmer ordinances and legislation. Proud to stand with farmers as their daughter & sister.
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) September 17, 2020
‘రైతులకు వ్యతిరేకంగా ఉన్న శాసనాలు, చట్టాలకు నిరసనగా నేను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశా. రైతుల కూతురుగా, సోదరిగా వారి పక్షాన నిలవడం గర్వంగా ఉంది’ అని గురువారం తన రెసిగ్నేషన్ తర్వాత హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.