భారీ మెజార్టీతో హ్యాట్రిక్ కొడతా : తలసాని శ్రీనివాస్ యాదవ్

భారీ మెజార్టీతో హ్యాట్రిక్ కొడతా :   తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావు నగర్, వెలుగు :  భారీ మెజార్టీతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని సనత్ నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సెగ్మెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పద్మారావునగర్​లోని బీఆర్ఎస్ ఆఫీసు వద్ద మొదలైన ర్యాలీ ముషీరాబాద్, కృష్ణానగర్ కాలనీ, గాంధీనగర్ పీఎస్, జబ్బార్ కాంప్లెక్స్, సిటీ లైట్ హోటల్, మోండా మార్కెట్, మహంకాళి టెంపుల్, మినిస్టర్ రోడ్, రసూల్ పురా, పాటిగడ్డ, ప్రకాశ్ నగర్, బేగంపేట, గ్రీన్ పార్క్ హోటల్, కనకదుర్గమ్మ టెంపుల్, సత్యం థియేటర్, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, బల్కంపేట టెంపుల్, ఫతేనగర్ ఫ్లైఓవర్, సనత్ నగర్ బస్టాప్ మీదుగా జెక్ కాలనీ వరకు కొనసాగింది.  

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో సనత్ నగర్​ను ఎంతో డెవలప్ చేశామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టి మురుగు రోడ్లపై పారకుండా చేశామన్నారు. రూ.45 కోట్లతో బేగంపేట నాలా నిర్మాణం చేపట్టి వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. ర్యాలీలో సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇన్ చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్లు కొలను లక్ష్మీ, కుర్మ హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ, నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 

అనంతరం బన్సీలాల్ పేట డివిజన్ లోని సున్నం బట్టీ, అరుణ జ్యోతి కాలనీల్లో తలసాని శ్రీనివాస్ ప్రచారం చేశారు. సనత్​నగర్  పరిధిఅశోక కాలనీలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసీముల్లా ఖాన్, ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు.