
హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి.. ఇటీవల చార్మినార్ సమీపంలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంతో నగరంలోని అపార్ట్ మెంట్లలో ఫైర సేఫ్టీపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గుల్జార్ హౌజ్ వద్ద ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం ఘటన అనేక పాఠాలు నేర్పిస్తోంది. 17 మంది మృతిచెందిన ఈ ఘటనకు కారణాలపై లోతైన విచారణ జరుగుతున్న వేళ రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల కంటే ఇలాంటి దురదృష్టకర ఘటనలు భవిష్యత్తులో పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా అందరిపైనా ఉంది.
చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇరుకైన రోడ్లు, సందులతో ఉంటాయి. ప్రమాదం జరిగిన భవనానికి కూడా రాకపోకల కోసం ఒకే ఇరుకైన ద్వారం ఉండడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నా మరిన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడ నియమ నిబంధనలపై ఎవరికీ ఏమాత్రం పట్టింపులేదని, వాటిపై చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉందని క్షేత్రస్థాయికి వెళ్తే
అవగతమవుతోంది.
గుణపాఠం నేర్వాలి
నగర చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదంగా నమోదైన గుల్జార్ హౌజ్ ఘటనపై రాజకీయ పార్టీలు వారి వారి కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు సమయానికి రాలేదని కొందరు, వచ్చాయని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. వచ్చిన వాటిలో కూడా సరైన సదుపాయాలు, పరికరాలు లేవనే విమర్శలూ ఉన్నాయి. వాస్తవానికి ఘటన ప్రదేశం ఫైర్ స్టేషన్కు రెండు నిమిషాల దూరంలోనే ఉంది. చార్మినార్ వద్ద అంబులెన్స్ నిత్యం అందుబాటులో ఉంటుంది. చార్మినార్ వద్దనే పోలీస్ స్టేషన్ ఉంది. అన్నీ చుట్టూఉన్నా భారీ ప్రమాదమే జరిగింది. గుల్జార్ హౌజ్ ఘటన నుంచి గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉంది. గుల్జార్ హౌజ్ ఘటనతో పాతబస్తీపై కళ్లు తెరవాలి.
ట్రాన్స్ఫార్మర్లపై హెవీలోడ్
రాత్రి సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లపై హెవీలోడ్ పెరగడంతో గృహోపయోగ విద్యుత్ పరికరాలు పేలిపోవడం ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే. ఇక రంజాన్, దసరా వంటి పండుగ వేళల్లో ఇలాంటి సమస్యలు మరింత అధికంగా ఉంటాయి. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఏమాత్రం లేదని అక్కడ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. నిబంధనలకు వ్యతిరేకంగా విద్యుత్ వైర్లపై కొక్కాలు వేయడంతో పాతబస్తీలో అధికంగా విద్యుత్ చౌర్యం జరుగుతుందని, ఎవరైనా సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తారనేది బహిరంగ రహస్యమే. దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తూవస్తున్నాయి.
మదీనా నుంచి ఫలక్నుమా వరకు రహదారులను పరిశీలిస్తే ఇరుకైన రోడ్లపైనే రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చినా దారి దొరకడం గగనమే. చార్మినార్ కట్టడాన్ని సందర్శించడానికి వచ్చే వాహనాలకు సరైన పార్కింగ్ వసతే ఉండదు. గుల్జార్ హౌజ్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ప్రయివేట్ వ్యక్తులు ఇష్టారీతిలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తూ రోడ్లపైనే అక్రమంగా వాహనాలను నిలుపుతుండడంతో ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి వరకూ పాతబస్తీలో ట్రాఫిక్ నిత్యం జామ్ అవుతూనే ఉంటుంది.